సిద్దిపేట : ‘‘ఆసరా పింఛన్లు ఇవ్వడం సాధ్యమవుతుందా..కల్యాణలక్ష్మి సాయం చేయడం అంటే మాటలా..రైతుబంధు ద్వారా పెట్టుబడి అనేది ఎన్నికల హామీనే.. కాళేశ్వరం ప్రాజెక్టును కలలో కూడా కట్టలేరు.. మిషన్ భగీరథతో మంచినీళ్లు ఇంటింటికి వస్తాయా.. అని ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు, వెక్కిరింతలు చేసినా ఈ పథకాలే నేడు తెలంగాణ ప్రజల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇదే తరహాలో దళితబంధు పథకం కూడా రాష్ట్రమంతటా అద్భుతంగా అమలు జరుగుతుందన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు’’ అంటూ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు.
సిద్దిపేటలోని టీఆర్ఎస్ పార్టీ భవన్లో సోమవారం హుజూరాబాద్ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇంచార్జులకు ఎన్నికల ప్రచారం గురించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికలు అనగానే బిజేపీ పార్టీ దొంగ డ్రామాలు ప్రారంభిస్తుందన్నారు. ప్రచారంలో గాయాలు అయినట్లు, అనారోగ్యానికి గురైనట్లు, ఒళ్లంతా పట్టీలు కట్టుకొని తిరుగుతూ సానుభూతి పొందడం ఆ పార్టీ ప్రచార ప్రణాళికలో ఓ ఎత్తుగడ అని విమర్శించారు.
ఈ ఎత్తుగడలను బెంగాల్, తమిళనాడుల్లో బండకు కొట్టి బిజేపీని తరమికొట్టారని మండిపడ్డారు. బిజేపీ పాలిత రాష్ర్టాల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని, రేపు హుజూరాబాద్లో బిజేపీ గెలిచినా నయాపైసా ఉపయోగం ఉండదన్నారు. వీరి డ్రామాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని హుజూరాబాద్ నేతలకు సూచించారు.
ఉద్యోగాలు ఊడగొట్టిన పార్టీ బిజేపీ..
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగాలను ఊడగొడుతున్న పార్టీ బిజేపీ అని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. బీఎస్ఎన్ఎల్ సంస్థలో సగం మందిని తొలగించారని అన్నారు. అన్నింటిని ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్లు ఎలా అమలవుతాయని ప్రశ్నించారు. బిజేపీ పార్టీ ఉద్యోగాలు ఊడగొడుతుంటే .. టీఆర్ఎస్ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తున్నదని, ఇప్పటివరకు 1.32లక్షల ఉద్యోగాలు కల్పించిందన్నారు.
త్వరలోనే 50 నుంచి 70వేల ఉద్యోగాల భర్తీపై చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వ రంగసంస్థలను అమ్మడానికి సపరేటుగా ఓ శాఖను ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వంలో బిసీ కులానికి ఓ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని నిలదీశారు.
భారీ మెజార్టీతో కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలి..
2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అయిన రోజుల్లోనే హుజూరాబాద్ నియోజకవర్గమంతా కేసీఆర్ వెంట ఉన్నారని మంత్రి గుర్తు చేశారు. నాడు జరిగిన ఎన్నికల్లో అన్నిచోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని చెప్పారు. నాడు ఈటల రాజేందర్ ఓ వ్యక్తిలా వచ్చి.. ఇప్పుడు ఓ వ్యక్తిలా వెళ్లిపోయాడే తప్ప పార్టీ మొత్తం కేసీఆర్ వైపే ఉందన్నారు. ఈటలకు టీఆర్ఎస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యత దక్కిందన్నారు.
కానీ ఆయనే తల్లిలాంటి పార్టీకి అన్యాయం చేయడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. అందుకే హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు ఈ గెలుపు ప్రతిష్టను, గౌరవాన్ని తెచ్చిపెడుతుందన్నారు. బిజేపీ పార్టీ లెక్క లేనిది ఉన్నట్లు చెప్పకుండా.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులనే ప్రజలకు చెప్పాలని దిశానిర్ధేశం చేశారు. భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలని సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపునూ ఎవ్వరూ ఆపలేరన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం.. సాయంత్రం కూతురి పెళ్లి.. ఉదయం తండ్రి మృతి
తల్లిని వదిలేసిన కొడుకులు..అక్కున చేర్చుకున్న పోలీసులు
హరితహారం మొక్కలు ధ్వంసం.. రూ. 5వేల జరిమానా
కీలక అంశాలపై చర్చకు మోదీ సర్కార్ వెనుకంజ!
Tokyo Olympics: చరిత్రలో ఇంతకు మించిన విజయం ఉండదేమో.