హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన మెడికల్ డివైజెస్ పార్కులో ఉత్పత్తులు మరింత జోరందుకోనున్నాయి. ఈ పార్కులో మరో ఐదు కంపెనీలు ఈ నెలలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వీటిలో ప్రఖ్యాత స్టెంట్ల తయారీ సంస్థ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ (ఎస్ఎంటీ), భీమవరపు ల్యాబొరేటరీస్, రీస్ మెడీలైఫ్, ప్రోమియో థెరపెక్యుటిక్స్, అర్కా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ఏర్పాటుచేసిన మెడికల్ డివైజెస్ పార్కులో పలు కంపెనీలకు భూములు కేటాయించగా.. ఎనిమిది సంస్థలు ఇటీవలే తమ యూనిట్ల నిర్మాణాన్ని పూర్తిచేశాయి. వీటిలో ఆకృతి ఐకేర్, ఎస్వీపీ టెక్నో, ఎల్విక్సన్ మెడికేర్ కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి మొదలుపెట్టాయి.
ఎస్ఎంటీలో 2,200 మందికి ప్రత్యక్ష ఉపాధి
ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ సంస్థగా భాసిల్లుతున్న ఎస్ఎంటీ రూ.250 కోట్ల పెట్టుబడితో ఇక్కడ యూనిట్ను ఏర్పాటుచేసింది. 20 ఎకరాల స్థలంలో ఏర్పాటైన ఈ యూనిట్ను అతిత్వరలో ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నది. దీని వార్షిక సామర్థ్యం 12 లక్షల స్టెంట్లు. ఈ యూనిట్ ద్వారా దాదాపు 2,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. మరోవైపు మెడికల్ డివైజెస్ పార్కులో బ్లూమ్ వేర్హౌసింగ్ అండ్ డివైజెస్, రెనోడ్ బయో, ఫ్లెక్స్డ్ టెక్నోప్యాక్, అపాజ్ ఇండియా ఇండస్ట్రీస్ తదితర సంస్థల నిర్మాణ పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి. ఈ కంపెనీలన్నీ ఉత్పత్తులు ప్రారంభిస్తే వైద్యపరీక్షలు, శస్త్రచికిత్సల్లో ఉపయోగించే అనేక రకాల పరికరాలు తక్కువ ధరకే లభిస్తాయని అధికారులు చెప్తున్నారు.