నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 20: రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేయడంతో ఆలయాల్లో గుడిగంట మోగింది. దాదాపు 39 రోజుల తర్వాత రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు తెరుచుకొన్నాయి. తొలిరోజు ఆదివారం భక్తులు సాధారణంగానే ఆలయాలకు రాగా.. సోమవారం నుంచి ఆర్జిత సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రముఖ దేవస్థానం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని 4 వేల మంది దర్శించుకొన్నారు. కొండగట్టు అంజన్న దేవస్థానానికి రూ.42,120 ఆదాయం సమకూరిందని ఈవో చంద్రశేఖర్ తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామివారు 45 రోజుల తర్వాత భక్తులకు దర్శనమిచ్చారు. మల్లన్న దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. మే 5 నుంచి ఆలయంలో దర్శనాలను నిలిపివేసి అంతర్గతంగా స్వామివారికి నిత్య పూజలను కొనసాగించారు. స్వామి వారి ఆలయం తెరుచుకోవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు కొమురవెల్లికి వచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 వేల మంది భక్తులు కాళేశ్వరానికి చేరుకుని ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచి, స్వామివారికి సుప్రభాత సేవ, మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారి అభిషేకం అనంతరం భక్తులను దర్శనం కోసం అనుమతించారు. భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు.