మహబూబ్నగర్ : ప్రస్తుత క్లిష్ట సమయంలో ఆక్సిజన్కు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ద్వారా మహబూబ్ నగర్ కు 50 ఆక్సిజన్ సిలిండర్లను పంపించగా.. శనివారం అఖిలభారత చిరంజీవి యువత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అసోసియేషన్, రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో ఎనుగొండలోని రెడ్ క్రాస్ శాంతి వనంలో మంత్రికి అందజేశారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా అనేకమందికి రక్తదానం చేసి చిరంజీవి ఎంతో మంది ప్రాణాలు కాపాడారని, ప్రస్తుతం చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు పంపించడం అభినందనీయమన్నారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో ఆక్సిజన్ కు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే ఇంకా బాగుంటుందని ఆయన చిరంజీవికి సూచించారు.
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేసిన సిలిండర్లు నిరంతరం అందరికి అందుబాటులో ఉండేలా చూడాలని, వాటిని ప్రభుత్వ జనరల్ దవాఖానకు అప్పగిస్తామని తెలిపారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కరోనా చికిత్సకు 500 పడకలతో పాటు వెంటిలేటర్లు, ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజక్షన్లు సహా ఇతర సదుపాయాలన్నీ ఉన్నాయన్నారు.
త్వరలోనే దవాఖాన ఆవరణలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నామని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో కరోనా థర్డ్ వేవ్ వచ్చినా కూడా ఇప్పటినుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా ఆలోచిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ముందు జాగ్రత్తగా ఉంటే కరోనా వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, కరోనాను నిర్లక్ష్యం చేసి ప్రాణం మీదికి వచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్లవద్దని ఆయన కోరారు.
కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజు నాయక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ శామ్యూల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెక్కెం జనార్ధన్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ లయన్ నటరాజ్, కోశాధికారి జగపతిరావు, మున్సిపల్ చైర్మన్ కె.సి నరసింహులు, కౌన్సిలర్ రామ్ లక్ష్మణ్, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, అఖిల భారత చిరంజీవి యువత పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి