ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఎరువులు, విత్తనాలు
జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, జూన్ 6: దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని చాంద(టీ) లో రైతులకు ఎరువులు, కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుబీమా, రైతుబంధు, 24గంటల విద్యుత్ అందిస్తూ అన్నదాతల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువులు, విత్తనాలను గ్రామాల్లోనే ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. దేశంలో సగం వరిని మన రాష్ట్రంలోనే పండించారని, దానిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. సహకార సంఘాలను బలోపేతం చేయడానికి రైతుల సహాయం అవసరమన్నారు. గ్రామంలో సహకార బ్యాంకు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వివరించారు. జిల్లాలోని రైతులకు 94 వేలమెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటి వరకు 39,644 మెట్రిక్ టన్నులు పీఏసీఎస్లలో పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రైతులను మోసం చేయడానికి కొందరు నకిలీవిత్తనాలు విక్రయించే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం బీఆర్జీ 176 కంది విత్తనాలను ఉచితంగా అందిస్తున్నదని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండుమూడు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి జొన్నలు కొనేలా చేస్తామన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, వైస్ఎంపీపీ గండ్రత్ రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్,సర్పంచ్ భాస్కర్, పీఏసీఎస్ చైర్మన్ కిరణ్, నాయకులు సెవ్వ జగదీశ్, జీవన్, ఏవో ఆశ్రఫ్, ఏఈవో ప్రసాద్ పాల్గొన్నారు.