హైదరాబాద్ : తామే 23 కంపెనీల ద్వారా భూములను అభివృద్ధి చేసి రూ. 2 వేల కోట్లు సేకరిస్తామని అగ్రిగోల్డ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు అభ్యంతరం చెప్పింది. 23 చోట్ల చేసే అభివృద్ధి పనులను తాము పర్యవేక్షణ చేయలేమని చెప్పింది. ఒకవేళ ఒప్పుకున్నా ఆ పనుల్లో వివాదాలు వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం మరింత ఆలస్యం అవుతుందని అభిప్రాయపడింది. చిన్న మొత్తాల పొదుపు పేరుతో జనాన్ని మోసం చేసిన అగ్రిగోల్డ్పై దాఖలైన పిల్స్ను న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ల ధర్మాసనం శుక్రవారం విచారించింది.
మహబూబ్నగర్ జిల్లాలో అగ్రిగోల్డ్కు చెందిన 150 ఎకరాలను వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తికి ఆ భూమిని ఎందుకు అప్పగించలేదని ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఇదే మాదిరిగా విజయవాడలో షాపింగ్ మాల్ను వేలంలో పొందిన వ్యక్తి దాఖలు చేసిన కేసును కూడా ఈ నెల 11న విచారిస్తామని చెప్పింది. ఏపీకి చెందిన వ్యవహారాలను అక్కడి హైకోర్టుకు బదిలీ చేయాలన్న వినతిపై ఏ నిర్ణయం వెలువడిందీ వచ్చే విచారణలో చెప్పాలని హైకోర్టు కోరింది. హైకోర్టు సూచనలకు అనుగుణంగా తాము రిట్ను సవరించి వేస్తామని అగ్రిగోల్డ్ చెప్పింది.