మహబూబ్ నగర్ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ పట్టణ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. కొత్త కలెక్టరేట్ సమీపంలో నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కమిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. ఆదర్శనగర్లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి మంత్రి భూమి పూజ నిర్వహించారు.
క్రిస్టియన్ పల్లిలో మందుల కమ్యూనిటీ ఆధ్వర్యంలో లో ఏర్పాటు చేయనున్న స్మశాన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీరన్నపేటలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో రూ. 172 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 20 కోట్లతో నిర్మించే మైనారిటీ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల పక్షాన నిలిచి పేదల అభివృద్ధికి పాటుపడుతున్నదని ఆయన తెలిపారు.
విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో సముచిత స్థానం కల్పిస్తూ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటుందని అన్నారు.
మహబూబ్ నగర్ పట్టణానికి భారత్ మాల రోడ్ వస్తుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, కౌన్సిలర్ రాణి రాజు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.