కొత్తపల్లి మున్సిపల్లో 90.29 శాతం చెల్లించిన ప్రజలు
గతేడాది కంటే అత్యధికంగా వసూలు
కొత్తపల్లి, ఏప్రిల్ 2: మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ప్రధాన ఆదాయం ఆస్తి పన్ను. ఆస్తి పన్ను పూర్తి స్థాయిలో వసూలైతే మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో తాగునీరు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్యం చక్కదిద్దేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన కొత్తపల్లి మున్సిపల్ పన్నుల వసూళ్లలో అగ్రగామిగా నిలుస్తోంది. మున్సిపల్ పరిధిలో 12 వార్డులుండగా 3020 ఇండ్లు ఉన్నాయి. ఇందులో 2020-21 సంవత్సరానికి గానూ రూ. 58.62 లక్షల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉండగా మార్చి 31 వరకు రూ 52.93 లక్షలు వసూలైనట్లు అధికారులు తెలిపారు. దీంతో మున్సిపల్ పరిధిలో 90 శాతం పైగా ఆస్తి పన్ను వసూలైంది. మార్చి మొదటి వారం వరకు సుమారు 72 శాతం పైగా ఆస్తి పన్ను వసూలు కాగా అధికారులు ప్రత్యేక దృష్టిసారించడంతో 31వ తేదీ వరకు 90 శాతం పైగా వసూలైనట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గతేడాది 61.73 శాతం ఆస్తి పన్ను వసూలు కాగా ఈసారి 90 శాతంపైగా వసూలైనట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని రూ. 10 వేల కంటే తక్కువ ఆస్తి పన్ను ఉన్న వారికి 50 శాతం రాయితీ ప్రకటించారు. ఒకవేళ ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించి ఉంటే వచ్చే సంవత్సరం చెల్లించిన మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని పేర్కొన్నారు. ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ చేస్తున్నారు. రాయితీ మొత్తాన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఇవి కూడా చూడండి..
ప్రపంచంలో తొలిసారి.. జంతువులకు కోవిడ్ టీకా ఇవ్వనున్న రష్యా