హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): పేదరికాన్ని శాశ్వతంగా రూపుమాపడం విద్యతోనే సాధ్యమవుతుందని, అందుకే నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ అనేక గురుకులాలను నెలకొల్పారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అన్ని వర్గాలకు ఉన్నత ప్రమాణాలతో ఉచితంగా కేజీ టు పీజీ విద్యను అందించడం ద్వారా మన విద్యార్థులు దేశంలోని గొప్ప విద్యా సంస్థ ల్లో స్థానం సంపాదిస్తున్నారని తెలిపారు. ప్రతిష్ఠాత్మ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో సీట్లు సాధించిన గిరిజన గురుకుల డిగ్రీ విద్యార్థులు బదావత్ సోని, రాథోడ్ నరేశ్ను ఆమె అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సోని(ఎంపీసీఎస్), సంగారెడ్డి జిల్లాకు చెందిన నరేశ్ ఇద్దరూ నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారే. సోని తండ్రి ఆటో డ్రైవర్గా, తల్లి దినసరి వేతన కూలీగా పనిచేస్తున్నారు.
జడ్పీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసి గిరిజన గురుకులంలో చదివిన సోని.. తిరుచ్చి ఐఐఎంలో పీజీ సీటు సాధించటం పట్ల మంత్రి హర్షం వ్యక్తంచేశారు. అదేవిధంగా రాథోడ్ నరేశ్ వైజాగ్ ఐఐఎంలో సీటు సాధించటం గొప్ప విషయమన్నారు. తల్లిదండ్రులు దినసరి కూలీలే అయినా నరేశ్ పట్టుదలతో చదువుకున్నారని మంత్రి అభినందించారు. ఈ ఇద్దరు విద్యార్థులకు అభినందనపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున నగదు పారితోషికం, ల్యాప్టాప్ను అందిస్తుందని ఆమె తెలిపారు. దీంతోపాటు ఐఐఎంలో వారి ట్యూషన్, పరీక్ష ఫీజులను, మెస్ చార్జీలకు అయ్యే రూ.5 లక్షలను కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోని ఉత్తమ విశ్వవిద్యాలయాలు, ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధించేలా ప్రభుత్వం గిరిజన గురుకులాల విద్యార్థులకు క్యాట్, జీఆర్ఈ, టోఫెల్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న విషయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ గుర్తుచేశారు.