హైదరాబాద్ : ఎస్వోటీ రాచకొండ పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను బహిర్గతపరిచారు. సంఘటనా స్థలం నుంచి రూ. 10,16,000 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, రూ.19,89,490 విలువ గల వివిధ బ్యాంక్ల డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ రూ.30,55,490గా సమాచారం. రాచకొండ కమిషనరేట్కు చెందిన ఎల్బీ నగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు రైడ్ చేశారు. మలక్పేటకు చెందిన క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడు బంటు రాజేశ్ను అదుపులోకి తీసుకున్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన బంటు రాజేశ్ బీటెక్ పూర్తి చేసి 2005లో నగరానికి వచ్చాడు. మలక్పేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటూ మొదటగా ఆన్లైన్లో బెట్టింగ్లకు పాల్పడేవాడు. విలాస జీవితం గడిపేందుకు అనంతరం తనే ఓ ఏజెంట్గా మారి అక్రమ సంపాదన వైపు అడుగులు వేసి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడ్డాడు.