అబ్బబ్బ! ఏం ప్లాన్ వేస్తున్నరు. ఓటు కోసం ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నరు. గెలవడం కోసం ఎంతకు దిగజారుతున్నరు. శకుని కంటే క్రూరంగా, జిత్తులమారి నక్క కంటే ఘోరంగా కుయుక్తులు పన్నుతున్నరు. హుజూరాబాద్లో ఓటమి తప్పదని తెలిసి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కుయుక్తులకు తెరతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. పరిస్థితులు ఎంత గందరగోళంగా మారినా ఫర్వాలేదు, ఓట్లరు ఎంత ఉద్వేగానికి గురైనా సంబంధం లేదు.. సానుభూతి ఓట్లు దక్కితే చాలు అన్న రీతిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. పోలింగ్ ముందు రోజు గానీ, పోలింగ్ రోజు గానీ ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటానికి కుట్ర పన్నుతున్నట్టు తెలిసింది.
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఓడిపోతానని ఈటలకు తెలిసిపోయినట్టుంది.. హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడుతారని అర్థమైన్నట్టుంది.. ఇక తాను చేయాల్సింది పరిస్థితులను గందరగోళం సృష్టించటమేనని, ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవటమేనని నిర్ణయించుకున్నారా? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తున్నది. భేషుగ్గా ఉన్నా, అనారోగ్యానికి గురైనట్టు నటించి ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని నమ్మించటం, తనపై తానే దాడులు చేయించుకొని అయ్యో పాపం అనుకొనేలా చేయటం, టీఆర్ఎస్ నేతలు వేరే పార్టీలోకి వెళ్తున్నారంటూ ఫేక్ వార్తలు సృష్టించటం వంటి కుట్రలకు, నీచపు ఎత్తుగడలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం ఈటల రాజేందర్ కొని తెచ్చుకొన్న టీమ్ వ్యూహాలు రచిస్తున్నదట. ఈ విషయాన్ని బీజేపీలోని కొన్ని వర్గాలు వెల్లడించాయి. ఈ ప్లాన్లను సరిగ్గా పోలింగ్ దగ్గరపడే సమయానికి(పోలింగ్ ముందు రోజు లేదా పోలింగ్ రోజు) అమలు చేయాలని చూస్తున్నట్టు సమాచారం అందింది.
ప్లాన్స్ ఇవే..?
అంబులెన్స్ నాటకం..:
ఈ ప్లాన్ ప్రకారం ఎన్నిక జరిగే ముందు రోజు ఈటల రాజేందర్ తీవ్ర అస్వస్థతకు గురవుతారు.పక్కనున్నవాళ్లు హడావుడి చేసి ఈటల ఆరోగ్యం పాడైంది అని ప్రచారంమొదలుపెడతారు. ఆ వార్త ప్రజల్లోకి వెళ్లేలోపే అంబులెన్స్ వస్తుంది. ఈటల హెల్త్ కండిషన్ సీరియస్ అంటా, హుటాహుటిన పెద్దదవాఖానకు తీసుకెళ్తారు. తద్వారా
ప్రజలను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఓట్లు దక్కించుకోవటం.
కౌశిక్రెడ్డి మళ్లీ కాంగ్రెస్లోకి..:
హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయిందని ఈటల, బీజేపీకి తెలిసిపోయింది. దీంతో ప్రజలను, టీఆర్ఎస్ కార్యకర్తలను గందరగోళానికి గురిచేసేందుకు పాడి కౌశిక్రెడ్డి మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్తారని ఫేక్ ప్రచారం చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ ఫేక్ ప్రచారంతో కౌశిక్రెడ్డి అభిమానులతోపాటు టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలను తప్పుదారి పట్టించాలన్నదే వాళ్ల ప్రధాన ధ్యేయమని తెలిసింది.
దాడి చేయించుకోవటం:
గతంలో కొందరు నేతలు ఎన్నికల సమయంలోనే తమపై తాము దాడులు చేయించుకొని ప్రజల సానుభూతి పొందిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి వ్యూహాలనే మళ్లీ అమలు చేయాలని, తద్వారా సానుభూతి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.
టీవీ ప్లేట్.. బ్రేకింగ్ న్యూస్:
ఓ ఉపఎన్నిక సందర్భంగా ఆడిన నాటకం ఇలాంటిదే. ఓ టీవీ చానల్ లోగోను వాడుకొని ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. పోలింగ్కు ఇంకొన్ని గంటల సమయమే మిగిలి ఉందనగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తను పోస్ట్ చేశారు. అది నిజమో! కాదో తెలుసుకొనేలోపే పోలింగ్ ముగిసింది.
ఇలా.. మరిన్ని కుయుక్తులను సిద్ధం చేసుకొని సమయానికి ఏది వీలైతే అది అమలు చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఇంతకుముందు కూడా ఈటల రాజేందర్.. తనపై దాడి చేయించుకొనేలా కుట్ర పన్నారు. కానీ, ముందే పసిగట్టిన టీఆర్ఎస్ దాన్ని బట్టబయలు చేసింది. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో టీఆర్ఎస్ నేతలు ఈటలపై దాడి చేసినట్టు ఆయనే ఒక డ్రామాను సృష్టించబోతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ బయటపెట్టారు. కాళ్లకు, చేతులకు కట్లు కట్టుకొని ఈటల కనిపించబోతున్నారని చెప్పారు. దీంతో ఈటల వేద్దామనుకున్న ఆ పాచిక పారలేదు. ఇప్పుడు ఓటమి తప్పదని తెలిసి కొత్త ఎత్తుగడలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.