నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 28: ఎగువతోపాటు స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరద పెరిగింది. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్ ప్రాజెక్టుల నుంచి శ్రీరాంసాగర్లోకి వరద పోటెత్తుతున్నది. మంగళవారం ఎస్సారెస్పీకి 3.55లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, 33 వరద గేట్లు ఎత్తి దిగువకు 4.49లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90.313 టీఎంసీలకు 79.301 టీఎంసీల నీరున్నది. నిజాంసాగర్లోకి 48,200 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 11 గేట్ల ద్వారా 72,200 క్యూసెక్కులను మంజీరలోకి విడుదల చేస్తున్నారు. సింగూర్కు వరద భారీగా రావడంతో 5 గేట్లు ఎత్తి 66,024 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 28.555 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. మంజీరా రిజర్వాయర్ ఆరుగేట్లు ఎత్తి 60 వేల క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్సారార్ జలాశయానికి 32,470 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 18 గేట్ల ద్వారా 34,759 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీకి 1,06,984 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 18 గేట్ల ద్వారా దిగువకు 1,66,680 క్యూసెక్కులు బయటికి వదులుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి రిజర్వాయర్కు 4.32 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 40 గేట్ల ద్వారా 3.90లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
జూరాలకు 55 వేల క్యూసెక్కులు
జూరాల ప్రాజెక్టుకు 55 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 59,533 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. శ్రీశైలం రిజర్వాయర్కు 74,200 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగుల వద్దకు నీటి నిల్వ ఉన్నది. నాగార్జునసాగర్ రిజర్వాయర్కు 58,066 కూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టు లో 589.60 అడుగుల వద్ద నీరున్నది.