త్వరలోనే పలువురు మంత్రుల రాక
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
హెలీప్యాడ్ నిర్మాణానికి చర్యలు: కలెక్టర్ రవి
కొండగట్టులో అధికారులతో సమావేశం
మల్యాల,మార్చి 19: చిన్న, పెద్ద హనుమాన్ జయంత్యుత్సవాలకు కొండగట్టు అంజన్న సన్నిధిలో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నేపథ్యంలో త్వరలోనే మంత్రు లు రానున్నారని పేర్కొన్నారు. ఆలయ ఆవరణలోని సానా కాటేజ్లో జగిత్యాల కలెక్టర్ గుగులోత్ రవి, ఎస్పీ సింధూశర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకె మాట్లాడారు. అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి రాతి విగ్రహాన్ని తయారు చేయిస్తామని చెప్పారు. ఆలయానికి ప్రతిరోజూ 10 లక్షల లీటర్ల భగీరథ నీరు సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. పరిశుభ్రత కోసం 150 మంది వలంటీర్లను నియమించనున్నామని పేర్కొన్నారు. పెద్ద హనుమాన్ జయంతిలోగా సీఎం కేసీఆర్ వచ్చే అవకాశమున్నదన్నారు. కలెక్టర్ రవి మాట్లాడుతూ ఏప్రిల్ 27న చిన్న జయంతి, జూన్ 4న పెద్ద జయంతిని పురస్కరించుకొని హెలీప్యాడ్ను నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులకు సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని ట్రాన్స్కో ఎస్ఈ వేణు, అవసరం మేరకు మందులు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్యాధికారి శ్రీధర్కు సూచించారు. ఎస్పీ సింధూశర్మ మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను అమర్చాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆల య పౌండర్ ట్రస్టీ మారుతీస్వామి, ఈవో చంద్రశేఖర్, జడ్పీటీసీలు రాంమోహన్రావు, ప్రశాంతి, సర్పంచ్ తిరుపతిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, పునుగోటి కృష్ణారావు, నేతలు రాంలింగారెడ్డి, మధుసూదన్రావు, రాఘవరెడ్డి, శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తలు ప్రవీణ్, జున్ను సురేందర్ ఉన్నారు.