హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): కరోనాకు కళ్లెం వేసేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం వేగవంతంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2.20 కోట్ల మందికి టీకా వేయడం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి 16 నుంచి ఇప్పటివరకు మొత్తం 1.34 కోట్ల మందికి టీకాలు వేయించింది. ఈ క్రమంలో మొదటి డోస్ తీసుకున్నవారు 50 శాతం దాటగా, రెండు డోసులు తీసుకున్నవారు 25 శాతం దాటారు. మొదటి డోస్ తీసుకున్నవారి సంఖ్య 1.09 కోట్లు కాగా, రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య దాదాపు 28 లక్షలుగా ఉన్నది. రెండు డోసుల మధ్య గడువును కేంద్ర ప్రభుత్వం 12 నుంచి 16 వారాలకు పెంచడంతో కొవిషీల్డ్ తీసుకున్నవారు ఇప్పుడు రెండో డోస్ తీసుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు ప్రభుత్వం మొదటి డోస్ను అందిస్తూనే, రెండో డోస్వారికి ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకొంటున్నది. ఇందుకు తమకు ఎక్కువ వ్యాక్సిన్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. స్పందించిన కేంద్రం జూలై నెలకు కేటాయించిన 18 లక్షల వ్యాక్సిన్లకు అదనంగా మరో 4 లక్షలను కేటాయించిందని వైద్యవర్గాలు తెలిపాయి. జూలై చివరినాటికి రాష్ట్రంలో రెండో డోస్ తీసుకొనేవారు 20 లక్షలు, ఆగస్టునాటికి మరో 10 లక్షల మంది ఉంటారని, వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, సాధ్యమైనతం త్వరగా లక్ష్యాన్ని చేరుకొనేందుకు కృషిచేస్తున్నట్టు వైద్యాధికారులు వివరించారు.