నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పట్ల వెల్లువెత్తిన హర్షాతిరేకాలు
సెలూన్లు, ధోబీఘాట్లు, ఇస్త్రీ షాపుల్లో ఈ నెల ఒకటి నుంచే అమలు
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు
పాల్వంచ/ ఎర్రుపాలెం/వైరా/ సత్తుపల్లి రూరల్/ ఖమ్మం రూరల్/ ఇల్లెందు/ కొత్తగూడెం అర్బన్/ మణుగూరు, ఏప్రిల్ 5: ధోబీఘాట్లకు, క్షౌరశాలలకు, ఇస్త్రీ షాపులకు నెలకు 250 యూనిట్ల వరకూ ఉచిత కరెంటు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, అధికారులు వెంటనే ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ తమను మరింతగా ఆదుకుంటున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు. పాల్వంచ, వైరా, సత్తుపల్లి, ఎర్రుపాలెం మండల కేంద్రాల్లో రజక సంఘం, నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సీఎం ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్తో కలిసి ఆ మండల నాయీబ్రాహ్మణులు, రజకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మాట్లాడుతూ తరతరాలుగా కులవృత్తి ఆధారంగా జీవనం కొనసాగిస్తున్న లక్షల మంది రజక, నాయీబ్రాహ్మణ కుటుంబాలకు తాజా నిర్ణయంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఉచిత విద్యుత్తో యంత్ర పరికరాల వినియోగం పెరిగి శారీరక శ్రమ తగ్గుతుందని అన్నారు. ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని అన్నారు. మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.