హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): దళితబంధుతో రాష్ట్రంలో నవ సమాజ నిర్మాణానికి సీఎం కేసీఆర్ నాంది పలికారని ప్రభుత్వ విప్లు గొంగిడి సునీత, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. అంబేదర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారని, అదే స్ఫూర్తితో దళితబంధు తెచ్చారని పేర్కొన్నారు. గురువారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో వారు మాట్లాడారు. గతంలో దళితులకు పథకాలు కాగితాలపైనే ఉండేవని గొంగిడి సునీత అన్నారు. దళితుల గుండెల్లో సీఎం కేసీఆర్ అభినవ అంబేదర్గా నిలిచిపోతారని పేర్కొన్నారు. దళితబంధు పథకంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొంటూ సీఎం కేసీఆర్ యావత్ మహిళాలోకానికి సరికొత్త ప్రేరణనిచ్చారని తెలిపారు. దళితబంధు పథకం ప్రారంభమైన వాసాలమర్రి గ్రామం తన నియోజకర్గంలో ఉండటం తన అదృష్టమన్నారు. అందరం కలిసి సీఎం కేసీఆర్ ఆశించిన ఫలితాన్ని సాధించి తీరుతామని పేర్కొన్నారు. ఈ పథకాన్ని విజయంతం చేయటానికి పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలని కోరారు.
అడ్డుకొంటే గుణపాఠం తప్పదు
దళితజాతి సముద్ధరణ కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని అడ్డుకోవాలని చూసేవారికి తగిన గుణపాఠం చెప్తామని విప్ గువ్వల బాలరాజు హెచ్చరించారు. ఊరూరా దండోరా మోగించి అడ్డుకునే శక్తులను తిప్పికొడతామని స్పష్టంచేశారు. మూడేండ్లుగా సీఎం కేసీఆర్ దళితవర్గాల కోసం సుదీర్ఘ కసరత్తు చేసిన తరువాత దళితబంధు వచ్చిందని, ఎన్నికలు వచ్చాయని తెచ్చారనటంతో అర్థంలేదని కొట్టిపారేశారు. బడ్జెట్లోనే సీఎం దళిత్ఎంపవర్మెంట్ కోసం రూ.1,000 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. దళితులు బాగు పడాలని తలచే రాజకీయ పార్టీలు ఈ పథకాన్ని స్వాగతించాలని విజ్ఞప్తిచేశారు. ఈ పథకంపై బీజేపీ నాయకులు అర్థరహిత వాదాలు చేస్తున్నారని, ఇలాంటి పథకాన్ని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా అమలుచేస్తున్నారా? చెప్పాలని డిమాండ్చేశారు.
సీఎం కేసీఆర్కు దళితజాతి రుణపడి ఉంటుంది
దళితబంధుపై ప్రతిపక్షాల వాదనలు అర్థరహితమని ఎమ్మె ల్యే హన్మంత్షిండే విమర్శించారు. బంగారు తెలంగాణ సాధనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ధ్యేయమని పేర్కొన్నారు. దళిత బంధు తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు దళితజాతి రుణపడి ఉంటుందని స్పష్టంచేశారు. సంకుచిత ఆలోచనతో రాజకీయ విమర్శలు చేసేవాళ్లను పట్టించుకోబోమని తేల్చిచెప్పారు. ఇప్పటికే పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల ప్రజలు తమ రాష్ట్రంలో కేసీఆర్ పుడితే బాగుండని భావిస్తున్నారని పేర్కొన్నారు. బ్యాంకులతో సంబంధంలేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు వెళ్లడం దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయమని అభిప్రాయపడ్డారు.