శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్భూపతి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. అదితిరావు హైదరి, అనూఇమ్మాన్యుయెల్ కథానాయికలు. చిత్రీకరణ పూర్తయింది. థియేట్రికల్ రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నారు.
శుక్రవారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేమ, యాక్షన్ అంశాలు కలబోసిన భావోద్వేగభరిత కథాంశమిది. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది’ అన్నారు. ‘ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులముందుకు రావడం ఆనందంగా ఉంది.
తప్పకుండా కొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది’ అని సిద్ధార్థ్ తెలిపారు. ‘గత కొద్దిరోజులుగా ముఖ్య తారాగణంపై కీలక ఘట్టాలను తెరకెక్కించాం. వాణిజ్య అంశాలు కలబోసిన వినూత్న కథ ఇది’ అని నిర్మాత చెప్పారు. జగపతిబాబు, రావు రమేష్, రామచంద్రరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్తోట, సంగీతం: చైతన్ భరద్వాజ్, రచన-దర్శకత్వం: అజయ్భూపతి.