హైదరాబాద్ : తెలంగాణ విజయాలను దేశం గుర్తించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శాసనమండలిలో దేశంలో తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తి, విస్తీర్ణం, సదరు ఉత్పత్తికి వినియోగించిన నీరు, వరి ధాన్యం ఉత్పత్తి విలువపై శాసనమండలి సభ్యుడు తేరా చిన్నపరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధామిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ రైతు తల ఎత్తుకుని తిరుగుతున్నాడు. సాగు నీటి రాక, వ్యవసాయ పథకాలతో సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తులు పెరిగాయన్నారు. దేశంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
గత ఏడాది వానాకాలం, యాసంగిలో కలిపి రూ.41 వేల 240 కోట్ల విలువైన వరి ధాన్యం ఉత్పత్తి అయిందని మంత్రి తెలిపారు. ప్రతిపక్షాలు, కొందరు నేతలు అవగాహన లేక ప్రాజెక్టులు, పంటల మీద విమర్శలు చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు నిర్మించామన్నారు. ఏ ప్రాజెక్టు కట్టినా సాగునీటి కల్పనతో పాటు భూగర్భజలాలు, మత్య్స సంపద పెరుగుతాయి.
ఆరుతడి పంటలకు కూడా సాగునీరు అవసరం అన్నారు. ప్రాజెక్టు కడితే వరి పంట సాగుకే అనుకోవడం అవగాహనా రాహిత్యమన్నారు. మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్తో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కొందరు ధాన్యం ఎక్కువ ఎందుకు పండిస్తున్నారు అని ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
రాజస్థాన్లో వరి పండించగలరా? కేరళ, తమిళనాడులలో డిమాండ్ కు తగ్గ వరి ధాన్యం దిగుబడి వస్తుందా ? ఇక్కడ పండిన పంట దేశంలోని అనేక రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి అవుతుందన్నారు. దేశంలో ఆహార ధాన్యాలను సమతుల్యం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదన్నారు.
తెలంగాణ రైతాంగానికి మేలు జరిగేలా సభలో సుధీర్ఘ చర్చ జరగాలి. నూనె, పప్పుగింజల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతువేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను చైతన్యం చేస్తున్నామని వివరించారు. యాసంగిలో ఆరుతడి పంటలు సాగుచేయాలన్నారు. వేరుశెనగ పెద్ద ఎత్తున సాగు చేయాలని చెబుతున్నాం.
తెలంగాణలో పండే ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశెనగకు అంతర్జాతీయ డిమాండ్ ఉందని మంత్రి తెలిపారు. గత ఏడాది 3.75 లక్షల ఎకరాలలో ఉన్న సాగును ఈ ఏడాది 5 లక్షల ఎకరాల పైకి తీసుకుపోవాలని కృషి చేస్తున్నామని మంత్రి విరించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే అంశం మీద మరి కొద్ది రోజులలో స్పష్టత వస్తుందన్నారు.
పంజాబ్ లో వరిని కేంద్రమే కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ నుంచి కొనుగోలు చేయాలని కోరుతున్నాం.పంజాబ్ లో విస్తృతంగా వరి పండుతుంది .. ఆ తరువాత విస్తృతంగా వరి సాగయ్యేది తెలంగాణలోనే అని మంత్రి తెలిపారు. అందుకే పంజాబ్ మాదిరిగా పూర్తిస్థాయిలో ఇక్కడ కూడా వరి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.
నియంత్రిత సాగు మీద కొందరు బురదజల్లి అక్కసు వెళ్లగక్కారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నేతలు పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి..
Crime News | నల్లగొండ జిల్లాలో 120 కిలోల గంజాయి పట్టివేత
Farmer Died : ఆందోళన చేస్తున్న రైతు మృతి.. గుండెపోటుతో అంటున్న పోలీసులు
Rain Alert | తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వానలు..