మద్దూరు, మే 20 : నిన్నమొన్నటి వరకు నాలుగు గోడల మధ్య చేతిలో సెల్ఫోన్తో గంటల కొద్ది గడిపిన ఆ చిన్నారులు.. సెల్ఫోన్కు టాటా చెప్పి, ఆటలకుసై అంటూ ప్రస్తుతం ఆటస్థలంలో ‘హ్యాండ్ (లో) బాల్’ పట్టి దుమ్ము లేపుతున్నారు. రోజురోజుకూ ఆటలకు దూరమైపోతున్న చిన్నారులకు హ్యాండ్బాల్ ఆటను పరిచయం చేసి వారిని గొప్ప హ్యాండ్బాల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొన్నేండ్లుగా 10 నుంచి 17 ఏండ్ల లోపు బాలబాలికలకు మద్దూరులో హ్యాండ్బాల్ సమ్మర్ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమ్మర్ కోచింగ్ సెంటర్లో హ్యాండ్బాల్ క్రీడలో ఓనమాలు నేర్చుకొని ఎంతో మంది బాలబాలికలు ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిపోటీల్లో రాణిస్తున్నారు.
కోచింగ్ సెంటర్లో 40 మంది చిన్నారులకు శిక్షణ
మద్దూరు మండల కేంద్రంలోని హైస్కూల్లో హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కందుకూరి ఉపేందర్గుప్తా ఆదేశాల మేరకు ఈ నెల 6న హ్యాండ్బాల్ శిక్షణాశిబిరాన్ని గ్రామ సర్పంచ్ కంఠారెడ్డి జనార్దన్రెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో ప్రస్తుతం సుమారు 40 మంది బాల బాలికలు శిక్షణ పొందుతున్నారు. ఈ నెలాఖరు వరకు కొనసాగనున్న ఈ శిబిరంలో కోచ్లు బాలబాలికలకు హ్యాండ్బాల్లో పలు మెలకువలు నేర్పుతున్నారు. దీంతో బాలబాలికలు హ్యాండ్బాల్ క్రీడలో రాణిస్తున్నారు. శిక్షణ పొందిన బాలబాలికలకు శిక్షణ ముగిసిన వెంటనే హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లను అందించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు సైతం ఆడేవిధంగా శిక్షణను ఇచ్చినట్లు కోచ్లు తెలిపారు. ఈ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన బాలబాలికలను వచ్చే నెల సిద్దిపేటలో జరిగే రాష్ట్ర, జిల్లా స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.