ఎల్బీనగర్, ఏప్రిల్ 29 : జీహెచ్ఎంసీ లింగోజిగూడ డివిజన్(18) ఉప ఎన్నిక శుక్రవారం జరుగనున్నది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా 24 ప్రాంతాల్లో 57పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 358మంది పోలింగ్ సిబ్బంది తమ విధులను నిర్వహించనున్నారు. వీరిలో 72మంది ప్రిసైడింగ్ అధికారులు, 214మంది ఓపీఓలు, ఐదుగురు జోనల్ అధికారులు, రెండు ఫ్లైయింగ్ స్కాడ్, రెండు స్టాటిక్ సర్వేలైన్ టీమ్లు ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. సరూర్నగర్ మెమోరియల్ హోంలో ఏర్పాటుచేసిన రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు గురువారం ఎన్నికల సామగ్రిని తరలించారు. పూర్తిగా కోవిడ్ నియమ, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కడ అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
లింగోజిగూడ ఉప ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు నిలిచారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ నుంచి మందుగుల అఖిల్ పవన్గౌడ్, కాంగ్రెస్ నుంచి దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా చాలిక చంద్రశేఖర్, జల్ల నాగార్జున, షేక్ ఫర్వేజ్ ఉన్నారు.