హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే శిక్షణ కోసం పట్నం రావాల్సిందే. అద్దెగదుల్లో, వసతి గృహాల్లో నెలలపాటు ఉండి శిక్షణ తీసుకోవాల్సిందే. అందుకోసం లక్షలు వెచ్చించాల్సిందే. లేదంటే ఉద్యోగం ఆశ వదులుకోవాల్సిందే. ఇది గతం. ఇప్పుడు సీన్ మారిపోయింది. హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లి ఖరీదైన శిక్షణ తీసుకోకుండానే పేద, మధ్యతరగతి యువత తమ ఆశయాలు సాధించేందుకు రాష్ట్రంలోని గ్రంథాలయాలు ఆలంబన అవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో కొత్తరూపు సంతరించుకున్న లైబ్రరీలు పేద ఉద్యోగార్థుల కలలను సాకారం చేస్తున్నాయి. నైపుణ్యాలకు పదునుపెట్టే వేదికలవుతూ.. ఉద్యోగాలకు దగ్గరి దారి చూపుతున్నాయి.
గతంలో కనీస వసతులు లేని గ్రంథాలయాలు నేడు అత్యాధునిక వసతులతో కళకళలాడుతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని గ్రంథాలయాలను తీర్చిదిద్దుతున్నారు. యువతీ యువకులకు వేర్వేరుగా రీడింగ్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తున్నారు. పలుచోట్ల దాతల సహకారంతో ఉద్యోగార్థుల కోసం పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ కూడా అందిస్తున్నారు.
పేద, మధ్యతరగతి ఉద్యోగార్థులను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లోని కేంద్ర గ్రంథాలయం, చిక్కడపల్లిలోని వట్టికోట అళ్వారుస్వామి నగర గ్రంథాలయం, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ ప్రాంతీయ గ్రంథాలయం తదితరచోట్ల రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటుచేసింది. హరేకృష్ణ ఫౌండేషన్తో కలిసి రూ.5కే కడుపునిండా భోజనం అందిస్తున్నది. ఉదయమే గ్రంథాలయాలకు చేరుకొని, మధ్యాహ్నం అక్కడే భోజనంచేసి సాయంత్రం గ్రంథాలయాలను మూసివేసిన తర్వాత ఇంటికి తిరిగివెళ్తున్నారు.
లైబ్రరీల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో వందలమంది పేద, మధ్యతరగతి యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు. మారుమూల మంచిర్యాల జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ స్టడీసర్కిల్ ద్వారానే 122 మంది వివిధ ఉద్యోగాలు సాధించడం విశేషం. హైదరాబాద్ కేంద్ర గ్రంథాలయం, చిక్కడపల్లి నగర లైబ్రరీ, ఖమ్మం, కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్ గ్రంథాలయాలు కొలవులు కొట్టే వేదికలుగా నిలుస్తున్నాయి. డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ (డీఈఎఫ్) సహకారంతో మహిళలు, గృహిణుల కోసం వికారాబాద్, మహబూబ్నగర్, కామారెడ్డి జిల్లా గ్రంథాలయాల్లో టీఈజీ (టెక్నికల్ ఎంపవర్మెంట్ ఫర్ గర్ల్స్) పైలట్ ప్రాజెక్టును చేపట్టి కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు.
గ్రామ కార్యదర్శులు 29
పోలీస్ కానిస్టేబుల్స్ 32
సబ్ఇన్స్పెక్టర్లు 02
గణాంక అధికారులు 03
గురుకుల ఉపాధ్యాయులు 18
సింగరేణి డాక్టర్లు 01
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు 13
ల్యాండ్ అండ్ సర్వే 01
వెటర్నరీ అసిస్టెంట్ 04
వీఆర్వోలు 18
రైల్వేజాబ్ 01
మొత్తం 122
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కంటైనర్ గ్రంథాలయాలు అందుబాటులోకి రానున్నాయి. భవనాల నిర్మాణం భారీ వ్యయంతో కూడుకొన్నది కావటంతో కంటైనర్లనే లైబ్రరీలుగా వాడుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదట రంగారెడ్డి జిల్లాలోని 120 పాఠశాలల్లో వీటిని ఏర్పాటుచేస్తారు. 12 మీటర్ల పొడవైన కంటైనర్లో దాదాపు 6 వేల పుస్తకాలతో లైబ్రరీని ఏర్పాటుచేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇవి 20 ఏండ్లవరకు చెక్కుచెదరకుండా ఉంటాయని చెప్తున్నారు. కంటైనర్ లైబ్రరీల ఏర్పాటుపై అధికారులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ఆదేశాలిచ్చారు.
మాది మంచిర్యాల సీసీ కాలనీ. రోజూ ఉదయమే మంచిర్యాల గ్రంథాలయానికి వెళ్లేదాన్ని. 2018లో కానిస్టేబుల్ ప్రవేశ పరీక్ష రాసి ఎంపికయ్యా. లైబ్రరీలో ఇచ్చిన ఉచిత శిక్షణే ఉపయోగపడింది.
– వరలక్ష్మి, కానిస్టేబుల్, కాగజ్నగర్ రూరల్ పోలీస్స్టేషన్ (మంచిర్యాల)
మాది మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్. పీజీ చదివా. ఆ వెంటనే మహబూబ్నగర్ జిల్లా గ్రంథాలయంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కోసం వెళ్లా. అప్పటివరకు నాకు ఇంటర్నెట్, కంప్యూటర్పై పెద్దగా అవగాహన లేదు. కానీ లైబ్రరీలో అనేక అంశాలను నేర్పించారు. ఎంఎస్ ఆఫీస్ కోర్సు పూర్తిచేశాను. ఇటీవల ఓ ప్రైవేట్ కంపెనీలో డాటా ఎంట్రీ జాబ్లో చేరా. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు దీటుగా ఇక్కడ కోర్సులు నేర్పించారు.
– మంజుల, ప్రైవేట్ ఉద్యోగి
మాది నల్గొండ జిల్లా దిండిగల్ మండలం తవల్కపూర్ గ్రామం. 2015లో ఎంటెక్ పూర్తి చేసి కాంపిటీటివ్ పరీక్షలపై దృష్టి పెట్టా. అఫ్జల్గంజ్ సెంట్రల్ లైబ్రరీకి పొద్దున్నే వెళ్లి గ్రంథాలయం మూసే సమయానికి ఇంటికి వెళ్లిపోయేవాడిని. చదువుకొనేందుకు ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉండేది. గ్రంథాలయ అధికారుల సహకారంతోనే 2016లో గ్రూప్ 2 జాబ్ కొట్టా.
– మహమ్మద్ ఇబ్రహీం పాషా, ఎక్సైజ్ ఎస్, సరూర్నగర్.
మాది ఖమ్మం జిల్లా పుట్టకోట గ్రామం పరిధిలోని వెలుగుమట్ల. నేను కానిస్టేబుల్ ఉద్యోగం సాధించటానికి ఖమ్మం గ్రంథాలయం ఎంతో ఉపయోగపడింది. 2018లో నోటిఫికేషన్ రాగానే రోజూ లైబ్రరీకి వెళ్లేవాడిని. అక్కడి అధికారులను ఏ పుస్తకం అడిగినా వెంటనే అందుబాటులో ఉంచేవారు. ఏసీ స్టడీ హాల్ ప్రశాంతంగా ఉండేది. లైబ్రరీ ఆధ్వర్యంలో ఆర్థమెటిక్, రీజనింగ్పై రెండు నెలలపాటు ఇచ్చిన ఉచిత కోచింగ్ ఎంతో ఉపయోగపడింది.
– బోడ రవి, కానిస్టేబుల్ (ట్రైనీ), ఖమ్మం
మాది నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం అమీర్నగర్. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగం సాధించటానికి నిజామాబాద్ లైబ్రరీనే ఎంతో ఉపయోగపడింది. పొద్దున్నే వెళ్లేవాడిని. మధ్యాహ్నం భోజనవసతి కల్పించాలని కోరగానే ఎమ్మెల్సీ కవిత వెంటనే ఆమె సొంత ఖర్చులతో ఆ సదుపాయాన్ని ఏర్పాటుచేశారు. ఇబ్బంది లేకుండా ఆహ్లాదకరవాతావరణంలో ఉద్యోగానికి సిద్ధమై హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించా. అంతా లైబ్రరీ చలువే. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– వీ రాము, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఆర్గుల్ బాయ్స్ బీసీ హాస్టల్