సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ ) : కరోనాతో కుటుంబ సభ్యులను కోల్పోయి కడుపు కోతతో అల్లాడుతున్న వారి కన్నీటిని తుడిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొవిడ్ నేపథ్యంలో గ్రేటర్లో మృతదేహాలను తరలించాలంటే దాదాపు 20 వేల నుంచి 35వేల వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మృతదేహాలను శ్మశానవాటికలకు ఉచితంగా తరలించేందుకు ప్రత్యేక వాహనాలను సమకూర్చింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ జోన్ల వారీగా ‘అంతిమ యాత్ర రథాలు’ ప్రవేశపెట్టినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్వింద్కుమార్ సోమవారం రాత్రి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో మొత్తం 14 అంతిమయాత్ర రథాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అవసరమైన వారు ఈ ఉచిత అంతిమ యాత్ర రథాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు జోన్ల వారీగా ఇంచార్జీలు, వాహన నంబరు, వారి ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు.