హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణపై కేంద్రం మరోసారి దుష్ప్రచారం చేస్తున్నది. అవకాశం ఉన్న ప్రతిసారి తప్పుడు లెక్కలు విడుదల చేస్తూ వాస్తవాలను కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ)-2020-21 పేరిట నీతి ఆయోగ్ ఇటీవల నివేదిక విడుదలచేసింది. అందులో వైద్యరంగంలో తెలంగాణ అథమస్థానంలో ఉన్నట్టు చూపింది. వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలని.. తెలంగాణలో ప్రతి పదివేల మందికి వైద్యులు, నర్సులు, మిడ్వైఫరీ మొత్తం కలిపి కేవలం 10 మందే ఉన్నారని పేర్కొన్నది. నిజాలు సరిచూసుకోకుండా, ఈ గణాంకాలను ఆధారంగా చేసుకొని ఓ వర్గం మీడియా అడ్డగోలు కథనం ప్రచురించింది. ప్రభుత్వంపై దుగ్ధ తీర్చుకునేందుకు అబద్ధపు లెక్కలు ప్రచారం చేయడంపై వైద్యారోగ్య సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. వైద్యారోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ ఉన్నతస్థాయిలో ఉందని, తప్పుడు లెక్కలు వైద్యులు ఆత్మైస్థెరాన్ని దెబ్బతీస్తాయని మండిపడుతున్నాయి.
ఇవీ వాస్తవాలు
ఎస్డీజీ లక్ష్యాల నివేదికలో వైద్యులు, నర్సులు, మిడ్వైవ్స్ రాష్ట్రంలో తక్కువ ఉన్నట్టు నీతిఆయోగ్ చూపింది. అతి చిన్న రాష్ట్రమైన ఉత్తరాఖండ్ కంటే ఇక్కడే తక్కువ ఉన్నట్టు పేర్కొన్నది. నిజానికి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వద్ద 39,000 మంది వైద్యులు, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ వద్ద 32 వేల మంది నర్సింగ్ సిబ్బంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ రెండూ కలిపితే 71వేల మంది ఉన్నారు. వైద్యుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకొని నీతిఆయోగ్ నివేదిక తయారుచేసినట్టు స్పష్టమవుతున్నది. అది కూడా 2016-17 సిబ్బందినే పరిగణనలోకి తీసుకొన్నది. 2016-17 వరకు కొత్త మెడికల్, నర్సింగ్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. 2014-16 మధ్య మెడికల్ కౌన్సిల్ వద్ద 16,500 మంది వైద్యులు రిజిస్టర్ చేసుకోగా, 2016 తర్వాత 22,500 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 22,500 మందిని నీతిఆయోగ్ లెక్కలోకి తీసుకోలేదని వైద్యసంఘాలు చెప్తున్నాయి. కొత్తగా రిజిస్టర్ అయిన నర్సుల సంఖ్యను కూడా కలుపకపోవడంతో తెలంగాణ వైద్యసిబ్బందిని తక్కువగా చూపి కేంద్రం కక్షసాధిస్తున్నదని ఆరోపిస్తున్నాయి.
డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారమే వైద్యులు
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలి. 2019-20 ఆర్థికసర్వే ప్రకారం దేశంలో 1,456 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 39,000 మంది వైద్యులు రిజిస్టర్ చేసుకున్నారు. రాష్ట్ర జనాభా సుమారు నాలుగు కోట్లు. అంటే ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ అనే నిబంధనను రాష్ట్రం దాదాపు అధిగమించింది. ఒకవైపు ప్రభుత్వ దవాఖానలు, మరోవైపు కార్పొరేట్, ప్రైవేటు దవాఖానలు రాష్ట్ర వైద్యరంగాన్ని ప్రపంచస్థాయికి చేర్చాయి. దేశ, విదేశాల నుంచి తెలంగాణకు నాణ్యమైన వైద్యం కోసం రోగులు వస్తుంటారు. పెద్ద సంఖ్యలో వైద్యనిపుణులు, వివిధ రాష్ర్టాల నర్సులు ఇక్కడ రిజిస్టర్ చేసుకొని వైద్య సేవలందిస్తున్నారు.
ఆరోగ్యసూచీల్లో ఉన్నత స్థితి
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కునారిల్లిన వైద్యరంగాన్ని స్వ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పటిష్ఠం చేశారు. అత్యంత ఖరీదైన వైద్య పరికరాలను కొనుగోలు చేసి ప్రపంచస్థాయి వైద్యం ప్రజలకు అందేలా చేశారు. బుధవారమే వివిధ జిల్లాల్లో డయాగ్నస్టిక్ కేంద్రాలను ప్రారంభించి 57 రకాల పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. కంటి వెలుగు కా ర్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రభు త్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం అద్భుత ఫలితాలను సాధించింది. చిన్నారులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నది. దీంతో ఆరోగ్య సూచీలైన మెటర్నల్ మోర్టాలిటీ రేట్, అండర్ 5 మోర్టాలిటీ రేట్ తగ్గడంతోపాటు ఇన్స్టిట్యూషనల్ మోర్టాలిటీ రేట్ తగ్గిం ది. ఇదంతా సరిపడా వైద్యులు, నర్సులు, ఇత ర సిబ్బంది లేకుండానే జరిగిందా అనేది ఆలోచించాలని వైద్య సంఘాలు అంటున్నాయి. తెలంగాణ ఆరోగ్యరంగం పటిష్ఠంగా ఉన్నందు నే ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర సహా ఉత్తరాది రాష్ర్టాల నుంచి నాణ్యమైన చికిత్సకో సం ఇక్కడి వస్తున్నారని వైద్యులు చెప్తున్నారు.
కొవిడ్ కట్టడిలో భేష్
కరోనా మహమ్మారిని రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటున్నది. మొదటివేవ్లో వైరస్ను కట్టడి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, రెండోవేవ్లో వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రచించిన ప్రణాళికలను యావత్దేశం ఆనుసరిస్తున్నది. రోగులను ముందే గుర్తించేందుకు చేపట్టిన జ్వర సర్వేతో గణనీయంగా మరణాలు తగ్గాయి. బాధితులు ఇండ్లలోనే కోలుకున్నారు. తగినంత వైద్యసిబ్బంది లేకుంటే ఇది సాధ్యమయ్యేదేనా?
దేశంలోనే తొలిసారి మిడ్వైఫరీ వ్యవస్థ
తెలంగాణ ఏర్పాటు తర్వాత దవాఖానల్లో ప్రసవాల (ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు) సంఖ్య గణనీయంగా 97శాతానికి చేరుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు తోడు, సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమిస్తుండటంతో గర్భిణులు ఇటువైపే ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు మరింత పెంచేందుకు దేశంలోనే తొలిసారి యునిసెఫ్ సహకారంతో మిడ్వైఫరీ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. ఎంపిక చేసిన నర్సులకు లండన్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ సహకారంతో 18 నెలల శిక్షణ ఇస్తున్నది. ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్న 30 మంది రాష్ట్రంలోని పది ప్రభుత్వ దవాఖానల్లో సేవలందిస్తున్నారు. మరో 200 మందికి శిక్షణ కొనసాగుతున్నది. ఎక్కువగా సిజేరియన్లు జరుగుతున్న ప్రాంతాల్లో వీరు సేవలందించనున్నారు.
మా వద్దే తాజా లెక్కలు
నీతిఆయోగ్ నివేదికలోని అంశాలు మా దృష్టికి వచ్చాయి. వాస్తవ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాం. వైద్యులు ఎంత మంది ఉన్నారనే పూర్తి వివరాలు మా వద్దే ఉంటాయి. మేం కేంద్రానికి తాజా వివరాలు పంపలేదు. కానీ నీతిఆయోగ్ సూచీలో తక్కువగా ఉన్నది. దీనిపై పరిశీలన చేస్తున్నాం.
-డాక్టర్ హన్మంతరావు, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్
కరోనా కట్టడి పెద్ద ఉదాహరణ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యరంగం తలరాత మారింది. ఎన్నడూ లేనన్నినిధుల కేటాయింపుతో వైద్యరంగం బలపడింది. శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన భారీగా ఉద్యోగాల భర్తీ జరిగింది. దవాఖానలు, మెడికల్ కాలేజీలు, ఆరోగ్యపథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయి. కరోనా మొదటి, రెండో వేవ్లను సమర్థంగా ఎదుర్కోవడమే తెలంగాణ ఆరోగ్యరంగం పనితీరుకు పెద్ద ఉదాహరణ.
-డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డాక్టర్స్ జేఏసీ స్టేట్ కన్వీనర్