ఇలా ఒకటి కాదు రెండు కాదు. నిత్యం వందలాది మంది సామాన్యులు తమ వేదనను వెల్లబోసుకుంటూ కల్వకుంట్ల కవిత చొరవతో సాంత్వన పొందుతోన్న తీరు వర్ణనాతీతం. ప్రాణవాయువు కావాలన్నా, వెంటిలేటర్ సాయం కోసమైనా, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అయినా సరే… వారికి కనిపించే ఏకైక మార్గం కల్వకుంట్ల కవిత. ఎమ్మెల్సీకి ఫోన్ చేస్తే సమస్య పరిష్కారం అయినట్లేనన్న నమ్మకం వారిది. కరోనా సోకిన వ్యక్తుల వద్దకు కట్టుకున్న, కన్నవారే వచ్చే పరిస్థితి లేని ఈ దయనీయస్థితిలో జాగృతి సైనికులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవ చేస్తున్నారు. కాల్ సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్ అనుసరించి వెనువెంటనే స్పందించి సహాయం మొదలు పెట్టడం రోజువారీ కర్తవ్యంగా మారింది. అవసరమైతే నేరుగా కొవిడ్ వార్డులోకి వెళ్లి వారికి మేమున్నామనే భరోసాను సైతం కల్పిస్తున్నారు. తద్వారా కరోనా బాధితుల్లో మానసికంగా ధృఢత్వాన్ని పెంపొందించి వారంతా త్వరగా కోలుకునేలా తెలంగాణ జాగృతి ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు.
పొరుగు రాష్ట్రం నుంచీ ఫోన్లు…
కరోనా సెకండ్వేవ్ విరుచుకుపడుతోన్న వేళ.. పేదలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొండంత అండగా నిలుస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలతోపాటు తెలంగాణ, మహారాష్ట్రలోని మన ప్రాంత వాసులెంతో మందికి సాయం చేస్తున్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ఇప్పటికే నిజామాబాద్, బోధన్ ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా అన్నదానం చేస్తుండగా కరోనా వేళలోనూ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. కడుపు నిండా భోజనం పెడుతూ ఇందూరు అన్నపూర్ణగా వెలుగొందుతోన్న కవిత ప్రస్తుతం కరోనా విపత్కర సమయంలోనూ ఎంతో మంది పేదలకు ఆసరాగా నిలుస్తున్నారు. ట్విట్టర్ వేదికగా అభ్యర్థనలు చేసినా, నేరుగా ఫోన్ చేసి సాయం కోరినా ఇట్టే స్పందిస్తున్నారు. సెకండ్వేవ్ వ్యాప్తితో సాయం కోసం వందలాది మంది ఫోన్లు చేస్తుండడంతో ప్రజలకు మేలు చేయాలనే తపనతో కాల్సెంటర్ను సైతం ఏర్పాటు చేశారు. నిజామాబాద్, హైదరాబాద్ కేంద్రంగా కాల్ సెంటర్లకు నిత్యం వందలాది ఫోన్లు వస్తున్నాయి. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికీ ఏదో రకంగా సాయం చేస్తూ మేలు చేస్తుండడం విశేషం. తెలంగాణ రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది కవిత ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లకు ఫోన్లు చేసి సాయం కోరుతున్నారు. వారికి కూడా అవసరమైన సాయం అందించడంలో కవిత ముందు నిలుస్తున్నారు.
ట్విట్టర్ వేదికగా…
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్ట్రా గ్రామ్ వంటి వేదికల ద్వారా వచ్చే అభ్యర్థనలపైనా స్పందిస్తున్నారు. మేడం సాయం కావాలంటూ ట్వీట్ చేస్తోన్న ప్రతి ఒక్కరికీ ఓపికగా సమాధానం ఇస్తున్నారు. ఆరోగ్య సమస్యలను తీర్చడం, కొవిడ్ లాంటి ఈ సమయంలో దవాఖానల్లో సామాన్యులకు బెడ్ సౌకర్యం కల్పించడం, ఆక్సిజన్, వెంటిలేటర్ వంటివి ఏర్పాటయ్యేలా చూడడంలో కవిత తీసుకుంటోన్న చొరవ అంతా ఇంతా కాదు. సామాజిక మాధ్యమాల్లో స్పందించడంతోపాటుగా ఆఫ్లైన్లో మెసేజ్లు పెట్టేవారికి కూడా కవిత తనదైన రీతిలో స్పందిస్తూ అండగా నిలబడుతున్నారు. ఎమ్మెల్సీగా ఉమ్మడి జిల్లాకు కల్వకుంట్ల కవిత పెద్దదిక్కుగా నిలుస్తున్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాల మెరుగుదలకు, ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యాలకు ప్రభుత్వ పెద్దలతో నిత్యం మాట్లాడుతున్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం జీజీహెచ్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరత నెలకొన్న సమయంలో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వేయి ఇంజెక్షన్లు తెప్పించడంలో కవిత చూపిన చొరవ మరిచిపోలేనిది.
నిరంతర అన్నదానం..
మూడున్నరేళ్లుగా దిగ్విజయంగా కొనసాగుతోన్న అన్నదాన కార్యక్రమం ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అభాగ్యులకు అమృతధారలా కనిపిస్తోంది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన, బోధన్ ప్రభుత్వ దవాఖానల్లో నిరంతరాయంగా అన్నదానం ద్వారా పేదల కడుపు నింపుతున్నారు కల్వకుంట్ల కవిత. ఇప్పటి వరకు సుమారుగా 8లక్షల మంది ఆకలి తీర్చిన ఎమ్మెల్సీ కవిత ఈ ఆపత్కాలంలోనూ రోజుకు వేయి మందికి అన్నదానం చేస్తుండడం విశేషం. నిజామాబాద్ జీజీహెచ్లో కరోనా రోగులకు సహాయకులుగా వస్తున్న వారెందరికో కవిత ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం లాక్డౌన్ సందర్భంలో రోగుల బంధువులు బయటికెళ్లి అన్నం తినే పరిస్థితి లేదు. అలాంటి వారికి ఉచిత అన్నదానం ద్వారా ఆకలి తీరుతోంది. ఇంటి భోజనాన్ని తలపించే మధ్యాహ్న భోజనం ఆరగిస్తున్న వారెందరో కవితను నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు.
పేదలకు సేవ చేయడం అదృష్టం
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు నిజామాబాద్, హైదరాబాద్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశాం. కరోనా బాధితులు రోజూ వందలాది మంది ఫోన్లు చేసి సాయం అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికీ సాంత్వన చేకూర్చే ప్రయత్నం మా నుంచి జరుగుతున్నది. వారు పడుతోన్న ఇబ్బందులను తొలగించేందుకు జాగృతి ప్రతినిధులంమంతా కలిసికట్టుగా పని చేస్తున్నాం. అవసరాన్నిబట్టి మేమున్నామనే భరోసా కల్పించేందుకు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడి వస్తున్నాం. పేద ప్రజలందరికీ ఇలాంటి క్రిటికల్ సమయంలో సేవచేసే భాగ్యం కలగడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. కాల్ సెంటర్లు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. మూడు షిఫ్టుల్లో మా సిబ్బంది బాధితుల ఫోన్లకు స్పందిస్తున్నారు. కావాల్సిన అవసరాలను సమకూరుస్తున్నారు.