అహ్మదాబాద్: కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించిన కార్పొరల్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తామన్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్)కు నోటీసులు జారీ చేసింది గుజరాత్ హైకోర్టు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి తాను అంగీకరించకపోవడంతో తనను ఉద్యోగంలో నుంచి ఎందుకు తీసేకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేశారని కార్పొరల్ యోగేందర్ కుమార్ కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఐఏఎఫ్తోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు పంపింది. అంతేకాదు జులై 1 వరకూ పిటిషనర్పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కూడా ఐఏఎఫ్ను ఆదేశించింది.
వ్యాక్సిన్కు నిరాకరించిన యోగేందర్ వల్ల మిగతా ఎయిర్ వారియర్స్, ఎయిర్ఫోర్స్ సిబ్బందికి కూడా ముప్పు ఉంటుందంటూ అతనికి మే 10వ తేదీన షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇది తీవ్ర క్రమశిక్షణారాహిత్యమే అవుతుందని ఐఏఎఫ్ స్పష్టం చేసింది. ఎయిర్ఫోర్స్లో కొనసాగడానికి అర్హుడు కాదని కూడా చెప్పింది. అయితే ఈ ఆదేశాలు భారత ప్రభుత్వ మార్గదర్శకాలతోపాటు రాజ్యాంగంలోని 14, 21 ఆర్టికల్స్ను కూడా ఉల్లంఘిస్తున్నాయని పిటిషన్లో యోగేందర్ వాదించారు. వ్యాక్సిన్ తీసుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగించడం పూర్తిగా అన్యాయమని, రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
తాను రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నానని, వ్యాక్సిన్ తీసుకోనని ఫిబ్రవరి 26వ తేదీని యోగేందర్ తన కమాండింగ్ ఆఫీసర్కు లేఖ రాశాడు. తాను అత్యవసరమైతే అలోపతి మందులు వాడతానని, వ్యాక్సిన్ వేసుకోవడం నుంచి తనను మినహాయించాలని కోరాడు. ఇదే విషయాన్ని తన పిటిషన్లో చెబుతూ.. తనకు ఇష్టం వచ్చిన చికిత్స తీసుకునే హక్కు ఉన్నదని, బలవంతంగా వ్యాక్సిన్ తీసుకోవాలనడం సరికాదని వాదించాడు.