హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ట్రం అమలుచేస్తున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (దోస్త్) విధానం యావత్తు దేశాన్ని ఆకర్షిస్తున్నది. తెలంగాణ బాటలో ఇప్పటికే ఆరు రాష్ర్టాలు నడుస్తున్నాయి. దోస్త్ తరహాలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం 2016 నుంచి దోస్త్ను అమలుచేస్తున్నారు. కాకతీయ, మహాత్మాగాంధీ, ఉస్మానియా, పాలమూరు, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ సీట్లను దోస్త్ ద్వారానే భర్తీచేస్తున్నారు. ప్రైవేటు, అటానమస్, ప్రభుత్వ కాలేజీలు అనే తేడాల్లేకుండా అన్ని కళాశాలలకు దోస్త్ విధానం వర్తింపజేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లోనూ ఆన్లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) ప్రవేశపెట్టి అడ్మిషన్లు కల్పిస్తున్నారు. దీనికి పూర్వరంగమంతా తెలంగాణ దోస్త్ నుంచే గ్రహించడం గమనార్హం. పంజాబ్ అధికారులు సైతం దోస్త్ను రోల్మెడల్గా తీసుకొనే ఆన్లైన్ ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఢిల్లీ వర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సైతం ఇదే తరహా విధానం కొనసాగిస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాలను యూజీ ఆన్లైన్ అడ్మిషన్స్ వెబ్సైట్ ద్వారా పూర్తిచేస్తున్నారు. మధ్యప్రదేశ్లో సైతం డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ తరహా విధానాన్నే అమలుచేస్తున్నారు. కేరళ, పంజాబ్లో కూడా వర్సిటీలవారీగా ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు.