కోస్గి, మే 25 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో గన్నీ బ్యాగులు అందించేలా చూస్తామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఏబీకే ఫంక్షన్ హాల్లో రైతులు, రైస్ మిల్ యజమానులు, కొనుగోలు కేంద్రాల సిబ్బందితో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులతో మాట్లాడి లక్ష గన్నీ బ్యాగులు తెప్పించామని, సకాలంలో రైతులకు అందించాలని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీ యజమానులు గోదాములకు తరలించాలన్నారు. మహబూబ్నగర్కు ఇక్కడి నుంచి ధాన్యాన్ని తీసుకెళ్తే తరుగు పేరుతో తగ్గిస్తున్నారని, దీంతో తమకు ఇబ్బందవుతుందని కొనుగోలు కేంద్రాల సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే కలెక్టర్ హరిచందనతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. లారీ యజమానులు కొనుగోలు కేంద్రాల వద్ద కవర్ కట్టడానికి డబ్బులు అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలా చేస్తే చర్యలు తప్పవన్నారు. రైస్ మిల్లర్లు సైతం ఎప్పటికప్పుడు ధాన్యాన్ని వర్కింగ్ చేసి పంపాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ శాసం రామకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, ఎంపీపీ మధుకర్రావు, కౌన్సిలర్లు శ్రీనివాస్, బాలేశ్, నాయకులు రాజేశ్, హరి, రైస్మిల్ యజమానులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.