హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): మాజీ ఐఏఎస్ను బురిడీ కొట్టించిన దొంగ కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస్తున్నది. మాజీ ఐఏఎస్ ఖాతా నుంచి రూ.13 లక్షలు కొట్టేసింది సిమ్ స్వాపింగ్ ద్వారా కాదని, ఇంటి దొంగల పనేనని తేల్చిన పోలీసులు.. తాజాగా, ఆ మాజీ అధికారి ఇంటి అడ్రస్తో దొంగ ఆధార్ కార్డు కూడా తీసినట్టు గుర్తించారు. దొంగ పరారయ్యాక దరఖాస్తు చేసుకొన్న ఆధార్కార్డు ఇంటికి రావటంతో ఈ విషయం తెలిసింది. ఈ కేసు విచారణలో సినిమాల్లో మాదిరి ట్విస్ట్లు ఎదురవుతున్నాయి. ఏపీలోని కర్నూల్ జిల్లా డోన్లో సురేందర్రావు పేరుతో నకిలీ ఆధార్కార్డు తీసుకొన్న నిందితుడు.. అదే పేరుతో హైదరాబాద్లో చలామణి అయ్యాడు. కన్సల్టెన్సీల ద్వారా పెద్దపెద్ద వాండ్ల ఇండ్లలో పనిచేస్తూ, అదను చూసి దొంగతనాలు చేశాడు. మాజీ ఐఏఎస్ ఇంట్లోనూ అలాగే పనికోసం చేరాడు. అంతకుముందు ఓ రాజకీయ నేత ఇంట్లో రెండ్నెల్లు పనిచేసినట్టు విచారణలో తేలింది. మాజీ ఐఏఎస్ సెల్ఫోన్లోనుంచి సిమ్కార్డును తీసి, తన ఫోన్లో వేసుకొని యూపీఐ ఐడీలు యాక్టివేట్ చేసి బ్యాంకుఖాతాల నుంచి సురేందర్రావు రూ.13 లక్షలు కాజేశాడు. ఆరునెలలపాటు పనిచేసిన దొంగ.. అనుమానం రాకముందే తన తల్లిదండ్రులకు కరోనా వచ్చిందని అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం వివిధ ప్రాంతాల్లో గాలింపు చేపట్టిన పోలీసులు.. బీహార్ యువతితో ఎక్కువగా మాట్లాడినట్టు గుర్తించి ఆమె కోసం వెళ్లగా ఆమెకూడా కనిపించలేదు. వారిద్దరు కలిసి నేపాల్ వెళ్లినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితుడు గతంలో వేరే ఎక్కడెక్కడ పనిచేశాడు? తదితర వివరాలు సేకరించి నిందితుడిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీసీఎస్ సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ పేర్కొన్నారు.