సూర్యాపేట : రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయించుకునేందుకు పీహెచ్సీకి వచ్చిన ప్రజల నుండి రూ.500 డిపాజిట్ సేకరించిన మెడికల్ ఆఫీసర్ను జిల్లా వైద్యారోగ్య అధికారి విధుల నుండి సస్పెండ్ చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో సోమవారం చోటుచేసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంఛార్జీ మెడికల్ ఆఫీసర్ క్రాంతి కుమార్ కొవిడ్ పరీక్ష కోసం పీహెచ్సీకి వచ్చే ప్రజలు రూ .500 జమ చేయాలని నిబంధన విధించారు.
ఫలితం పాజిటివ్గా వస్తే 500 తిరిగి ఇవ్వబడుతుందని లేకపోతే ఇవ్వమని తెలిపాడు. కొవిడ్ పరీక్ష కోసం పీహెచ్సీకి పరుగెత్తే, భయాందోళనలకు గురయ్యే వ్యక్తుల రద్దీని నియంత్రించడం కోసమే అని ఈ చర్యని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా ప్రచారమైంది. అనవసరమైన పరీక్షలను నిరుత్సాహపరిచేందుకు, లక్షణాలున్న రోగులందరినీ ముందుగా పరీక్షించేందుకే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.