హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖానకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ట్రాన్స్కో, జెన్కో పది వెంటిలేటర్లను అందించాయి. ఇందుకు అవసరమైన రూ. 70 లక్షల చెక్ను నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ మహేందర్కు శనివారం సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ఆధ్వర్యంలో ట్రాన్స్కో డైరెక్టర్ అజయ్, ఎస్ఈ టెక్నికల్ ఈగ హనుమాన్ అందించారు. వారం క్రితం నిమ్స్లో 500 ప్రత్యేక పడకలు ఏర్పాటుచేశామని దవాఖాన డైరెక్టర్ డాక్టర్ కే మనోహర్ తెలిపారు. వీటికి అదనంగా పది వెంటిలేటర్లు అవసరమయ్యాయని, ఈ విషయాన్ని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి రూ.70 లక్షలు అందించారని పేర్కొంటూ.. ప్రభాకర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో వారం, పది రోజుల్లో వెంటిలేటర్లను కొనుగోలుచేసి ట్రాన్స్కో, జెన్కో సీఎండీ చేతులమీదుగానే ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
కరోనా కట్టడికి వైద్యులు నిరంతరం కృషిచేస్తున్నారని, వారి సేవలు అభినందనీయమని సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. వారి సేవలో పాలుపంచుకునే అవకాశం కల్పించిన నిమ్స్ డైరెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. రెండోదశలో సుమారు మూడు వేల మంది విద్యుత్తు సిబ్బంది కరోనా బారిన పడ్డారని, తొందరలోనే సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తామని పేర్కొన్నారు.