హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం అవుతున్నది. బంగాళ ఖాతంలో గాలులు బలహీనంగా ఉన్నాయని, దీంతో రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం అవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈనెల14వ తేదీ తరువాతనే రుతుపవనాల ఆగమనం గురించి స్పష్టత వస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు.. రుతుపవనాల వర్షాలు కాదని స్పష్టం చేశారు. కేరళ, గోవా, కొంకణ్, కర్నాటక, తమిళనాడులలో విస్తరించిన రుతుపవనాలు కూడ బలహీనంగా ఉండడంతో అక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తున్నాయని తెలిపారు.
రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఉష్ఱోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం 21 జిల్లాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, ములుగు జిల్లా మేడారంలో 43.2, కరీంనగర్ జిల్లా తంగులలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా రాష్ట్రంలో 14వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 40 కిలోమీటర్ల వేగంలో ఈదురుగాలులు వీచేఅవకాశం ఉందని పేర్కొన్నది.