మంచిర్యాల : గొడ్డు మాంసాన్ని జింకల మాంసగా విక్రయించే ముసుగులో ఎద్దులను, ఆవులను అపహరిస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠాను మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు ఆటోలు, గొడ్డలి, ఆరు కత్తులు, ఆరు మొబైల్ ఫోన్లు, రెండు టార్చ్లైట్లు, రూ.6,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన నిందితుల వివరాలను రామగుండం సీపీ వి.సత్యనారాయణ వెల్లడించారు. బెల్లంపల్లి మండలం దుగినేపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి కళ్యాణ్, జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన గద్దల రాజశేఖర్, నర్సాపూర్ మండల హెడ్క్వార్టర్స్కు చెందిన మొహమ్మద్ సాకీర్, మందమర్రి మండలం గడ్డెరాగడికి చెందిన ఎలిగేటి శ్రీనివాస్, బెల్లంపల్లి మండలం గురిజాల గ్రామానికి చెందిన దుగుట స్వామి, బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లికి చెందిన సాగర్, గోదావరిఖనికి చెందిన జిలుమోడి కార్తీక్, నర్సాపూర్ సీసీసీకి చెందిన డీజే మ్యూజిక్ సిస్టం ఆపరేటర్ మీరడికొండ అజయ్ గా తెలిపారు.
ప్రజల్లో అడవి జంతువుల మాంసం పట్ల ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకునే నిమిత్తం గ్యాంగ్గా ఏర్పడి గత ఆరు నెలలుగా వీరు ఈ పని చేస్తున్నట్లు చెప్పారు. ఇందారం, జైపూర్, రామారావుపేట గ్రామాల్లో పొలాలకు మేత కోసం వచ్చిన పశువులను వీరు అపహరించుకుపోయేవారు. వీటి చర్మం తొలగించి మచ్చల జింక మాంసం, అడవి పంది మాంసంగా చెప్పి ఒక్కో కేజీని రూ.800కు అమ్ముతున్నారు. కొన్నిసార్లు స్థానిక ఔట్లెట్లలో గొడ్డు మాంసాన్ని తీసుకువచ్చి అదే జింక మాంసంగా విక్రయించేవారు. పశువుల అపహరణ కేసును విజయవంతంగా ఛేదించిన జైపూర్ ఎస్ఐ రామకృష్ణ, ఇతర సిబ్బందికి సీపీ అభినందనలు తెలిపి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్ పాల్గొన్నారు.