హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎంపిక ప్రక్రియలో తెలుగుకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కోరారు. ఆయా ఉద్యోగాల ఎంపికలో హిందీని బలవంతంగా రుద్దడంతో తెలుగు రాష్ర్టాల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో తెలుగు సహా 22 ప్రాంతీయ భాషలను అధికారికంగా గుర్తించిన విషయాన్ని ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కేంద్ర ఉద్యోగాల ఎంపికలో జోనల్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా జోనల్ ఎంపిక విధానాన్ని పక్కనపెట్టడం సరికాదని పేర్కొన్నారు. కేంద్రం విధానం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నదని అభిప్రాయపడ్డారు. కేంద్రం పరిధిలోని రైల్వే, పోస్టల్, పబ్లిక్వర్స్, సెంట్రల్ సెక్రటేరియట్, పబ్లిక్సెక్టార్ బ్యాంకులు, కంపెనీలు, రక్షణశాఖ, సెంట్రల్ యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ఐఐటీలు, నిట్, కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, ఎయిర్పోర్ట్ అథారిటీ సహా పలు సంస్థలలో ఉద్యోగాల ఎంపికలో హిందీ బదులు తెలుగును కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్చేశారు.