సినారె వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళి
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాహితీసౌరభాలను ‘విశ్వంభర’తో విశ్వవ్యాప్తం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డాక్టర్ సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆయనకు ఘన నివాళి అర్పించారు. కవిగా, రచయితగా, గేయ కావ్య కృతికర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీతాల రచయితగా తనదైన శైలిలో తెలంగాణ పద సోయగాలను ఒలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించిన సృజనకారుడు సినారె అని సీఎం అన్నారు. ప్రకృతి మానవతాత్వికతను ఆవహనం చేసుకొన్న ద్రష్ట, తెలంగాణ జాతికి జ్ఞానపీఠ్ అవార్డును అందించిన సాహితీ స్రష్ట సినారె అని ముఖ్యమంత్రి కొనియాడారు. దక్కనీ ఉర్దూ తెలుగు భాషా సాహిత్యాలను జుగల్బందీ చేసి, గజల్స్తో అలయ్ బలయ్ తీసుకొని, తెలంగాణ గడ్డమీద గంగా జమునా తెహజీబ్కు సినారె సాహితీ చిరునామాగా నిలిచారని సీఎం గుర్తుచేసుకొన్నారు. దేశీయ, అంతర్జాతీయ భాషల్లో తెలుగు సాహితీలోకంలో, తెలంగాణకు ఒక ప్రత్యేకస్థానాన్ని చేకూర్చిన సినారె కృషి అజరామరం అని కొనియాడారు. భాషాసాహిత్యాలు నిలిచి ఉన్నన్నాళ్లు ప్రజల హృదయాల్లో సినారె చిరకాలం నిలిచి ఉంటారని సీఎం కేసీఆర్ స్మరించుకొన్నారు.