హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో చక్రం తిప్పిన సాంబశివుడిని పోలీసులు అరెస్టు చేశారు. స్కాంలో అతని వాటా రూ.55 లక్షలుగా తేల్చారు. కెనరా బ్యాంకు చందానగర్ బ్రాంచి మేనేజర్ సాధన గతంలో వైజాగ్లో పనిచేశారు. అప్పట్లో యాడ్ ఏజెన్సీ నిర్వహించే గుంటూరుకు చెందిన సాంబశివుడు ఆమెకు పరిచయం అయ్యాడు. ఈ కుంభకోణంలో సూత్రధారి సాయికుమార్ ప్రధాన అనుచరుడు వెంకటరమణ కూడా సాంబశివుడిని కలిశాడు. తమకు సహకరిస్తే ప్రతి లావాదేవీకి రూ.5 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో భాగంగానే సాంబశివుడు.. సాధనకు వెంకటరమణను పరిచయం చేశాడు. దీంతో ఆమె వారి ట్రాప్లో పడింది. ఆమె వాటాగా రూ.2 కోట్లు ముట్టాయి. వైజాగ్లో ఒక ప్లాట్, రూ.20 లక్షల బంగారం కొన్నట్టు సాధన వివరించింది. కస్టడీలో సాంబశివుడి గురించి వెల్లడించడంతో సీసీఎస్ ఏసీపీ మనోజ్కుమార్ బృందం గుంటూరులో అతన్ని అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకొచ్చింది. మరోవైపు, సాయికుమార్ రూ.5 కోట్లు దుబాయ్లో ఆయిల్ సీడ్స్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసపోయానని కస్టడీలో వెల్లడించాడు. ఇది ఎంతవరకు వాస్తవమని పోలీసులు ఆరా తీస్తున్నారు.