మాడ్గులపల్లి: సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. భారతదేశమంతటా రాఖి పౌర్ణమి వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు. కానీ ఆ ఇంట కన్నీరే మిగిలింది. వాళ్లు ఐదుగురు అక్కాచెల్లెల్లు.. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ ముందు రోజే వచ్చి ఇంటిల్లిపాది ఆనందంగా గడిపి సోదరుడికి రాఖీలు కట్టి ఒకరికొకరు జ్ఞాపకాలు పం చుకుని సంతోషంగా వెళ్లే వారు. ఈ క్రమంలో ఎప్పటిలానే ఈ సంవత్సరం కూడా అన్నకు రాఖీ కడుదామని వచ్చిన వారికి కండ్ల ముందే సోదరుడి మరణం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా మాడ్లులపల్లి మండలం ఇందుగుల గ్రామ పరిధి మాలగూడెంకు చెందిన చింతపల్లి లక్ష్మయ్య (59) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ శనివారం మృతి చెందాడు. రేపు రాఖీ పండుగ అనగా ముందు రోజే సొదరుడు మృతి చెందడంతో ఐదుగురు అక్కాచెల్లెలు ఎర్ర లచ్చమ్మ, నామ పద్మ, అండ్ల పూరి వెంక టమ్మ, కదిరి కోటమ్మ, జక్కి కవితలు కన్నీరుమున్నీరయ్యారు.
పండుగకు సోదరుడికి రాఖీ కట్టాలనుకున్నామని ఇంతలోనే ఈ ఘటన జరిగిందని ఇకపై రాఖీ కట్టడానికి మా సోదరుడు కనిపించడని గుండెలవిసేలా రోదిస్తూ తన సోదరుడు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండటంతో మృతదేహానికి రాఖీలు కట్టి తమ ప్రేమను చాటుకున్నారు. అశ్రునయనాలతోతుది వీడ్కోలు పలికారు. ఈ ఘటన గ్రామంలో అందరినీ కంటతడి పెట్టించింది.