హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖకు ఏఐ గేమ్ ఛేంజర్ అవార్డు లభించింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత పరిశోధన, ప్రాజెక్టులను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. నాస్కాం నిర్వహించిన ఎక్స్పీరియన్స్-ఏఐ సమ్మిట్లో ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించారు. అద్భుతమైన ఏఐ టెక్నాలజీపై విస్తృతంగా అవగాహన పెంచడం, ప్రోత్సహించడం లక్ష్యంగా నాస్కాం ఈ కార్యక్రమం నిర్వహించింది. ఎంటర్ప్రైజెస్, స్టార్టప్స్, ప్రభుత్వ విభాగాలు, అకడమిక్ ఇనిస్టిట్యూషన్స్, ఎన్జీవోలు వర్చువల్గా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాయి.
ఎమర్జింగ్ టెక్నాలజీల ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచే వాటిని అందిపుచ్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నది. 2020 ఏడాదిని ఇయర్ ఆఫ్ ఏఐగా ప్రకటించింది. దీంతో పాటు కంప్యూటర్ విజన్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీలను ప్రభుత్వ విధానాల్లో వినియోగిస్తున్నారు. ఏఐ ఆధారిత క్రౌడ్ మానిటరింగ్ అమలు చేయడం కారణంగా ఏఐ గేమ్ ఛేంజర్ అవార్డు ఐటీ శాఖకు దక్కింది.
తెలంగాణ ఐటీ శాఖ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత క్రౌడ్ ఎస్టిమేషన్ అండ్ ప్రెడిక్షన్ ఇన్ యాక్షన్ యాప్ను రాష్ట్రంలో కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ వినియోగిస్తున్నది. సభలు, సమావేశాల సమయంలో సమూహాల్లో ఉన్న జనాభాను గుర్తించేందుకు, సంఖ్యను అంచనా వేసేందుకు ఇది ఉపయోగపడుతున్నది. 2019లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ టి20 క్రికెట్ మ్యాచ్ సమయంలో, 2020 మేడారం జాతర సమయంలో ఈ సాంకేతికతను వినియోగించారు. సంఖ్యతో పాటు, జనాభా సాంద్రతను దీని ద్వారా తెలుసుకోనున్నారు. దీని ఆధారంగా మ్యాన్ పవర్ ఏర్పాటు, పబ్లిక్ అనౌన్స్మెంట్, జనాభాను అదుపులో పెట్టడం వంటివి సాధ్యం కానుంది. మత సంబంధిత, రాజకీయ ర్యాలీలు, క్రీడలు, ప్రజా సమావేశాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.