హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి మహిళకే, ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పదవి మహిళకే, ఈ రెండు చోట్ల డిప్యూటీ మేయర్ పదవులు మహిళలకే, మరో మూడు చోట్ల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులూ మహిళలకే.. ఇదీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మహిళలకు ఇచ్చిన గౌరవం. రిజర్వేషన్లతో సంబంధం లేనిచోట్లా మహిళలకు అవకాశం ఇచ్చారు. అంతేకాదు.. జనరల్ స్థానాల్లోనూ బీసీ మహిళకు అగ్రపీఠం కట్టబెట్టారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. ఈ స్థానాన్ని బీసీ మహిళ (గుండు సుధారాణి-పద్మశాలి)ను మేయర్ చేశారు. సిద్దిపేట, కొత్తూరు అగ్రపీఠాలు జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి. ఈ రెండు స్థానాలను అగ్రవర్ణాలకు కేటాయించే అవకాశం ఉన్నా రెండుచోట్లా బీసీ మహిళలకే ఇచ్చారు. సిద్దిపేటలో కడవేరుగు మంజుల, కొత్తూరులో లావణ్య (యాదవ్)కు అవకాశం దక్కింది. జడ్చర్ల స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కాగా దోరేపల్లి లక్ష్మి (ముదిరాజ్)కి అవకాశం కల్పించి సామాజిక న్యాయం చేశారు.
గ్రేటర్ వరంగల్ డిప్యూటీ మేయర్గా రిజ్వానా షమీమ్, ఖమ్మం డిప్యూటీ మేయర్గా షేక్ ఫాతిమా జోహ్రా, జడ్చర్ల వైస్ చైర్మన్గా పాలాడి సారిక, నకిరేకల్ వైస్ చైర్మన్గా ఎం ఉమారాణి, అచ్చంపేట వైస్ చైర్మన్గా పోరెడ్డి శైలజను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. అదే సమయంలో సామాజిక న్యాయంలోనూ వెనక్కి తగ్గబోమని నిరూపించారు.