కనులపండువగా రంగనాయకస్వామి రథోత్సవం
భక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయ ప్రాంగణం
పాల్గొన్న మంత్రి నిరంజన్రెడ్డి
శ్రీరంగాపూర్, మార్చి 27 : వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రంగనాయకస్వామి రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తు లు వేలాదిగా తరలివచ్చారు. బాజాభజంత్రీలు, అర్చకుల వేదమంత్రాల మధ్య వేడుక నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ఆలయం వెలుపలికి తీసుకొచ్చి రథోత్సవంపై ఉంచారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఆలయ ధర్మకర్త కృష్ణదేవరావు ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. కళాకారుల చెక్క భజనలు, కోలాటాలు, మహిళలు బొడ్డెమ్మల మధ్య వేడుక ఆధ్యాంతం ఆనందమయంగా సాగిం ది. అంతకుముందు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీరంగనాయక స్వామి పల్లకీసేవ వైభవంగా నిర్వహించారు. యువకులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. స్వామి దర్శనంతో భక్తజనం పులకించిపోయింది. ఉదయం ఆలయంలో గంటల తరబడి క్యూలో నిల్చోని రంగనాయకస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరంగాపూర్, పెద్దమందడి, పెబ్బేరు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ప్రముఖుల పూజలు..
మంత్రి నిరంజన్రెడ్డితోపాటు ఎంపీపీ గాయత్రి, సర్పంచ్ వినీలారాణి ఆలయంలో రంగనాయకస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నేపథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈసారి భక్తులకు అన్నదానం చేయలేదు. వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించారు. ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్ రివర్స్ గేర్ పోటీలను మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా 15 తులాల వెండి, ద్వితీయ బహుమతిగా 10 తులాల వెండిని ప్రదానం చేశారు. ఈ పోటీలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు జగన్నాథం నాయుడు, రైతుబంధు మండల అధ్యక్షుడు గౌడ్ నాయక్, పృథ్వీరాజు, భక్తులు పాల్గొన్నారు.