కరీంనగర్ మార్చి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహా శివరాత్రి ఉత్సవాలకు వేములవాడ రాజన్న ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న జాతరకు అధికార యంత్రాగం భారీ ఏర్పాట్లు చేసింది. ఆలయంతోపాటు పట్టణంలో విద్యుత్ దీపాలు అలంకరించడంతో వేములవాడ వెలుగులమయమైంది. జాతరకు నాలుగు లక్షల మంది భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేశారు. గతేడాది 3.5 లక్షలకుపైగా వచ్చారు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్తోపాటు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మంగళవారం రాజన్నను దర్శించుకున్న అనంతరం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వేములవాడ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు.