హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం గతంలో దాఖలుచేసిన పిటిషన్ను ఉపసంహరణకు ఏపీ మోకాలడ్డుతున్నది. పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇవ్వొద్దని ఏపీతోపాటు, కర్ణాటక కోరింది. సుప్రీంకోర్టు ద్వారానే సమస్యను పరిష్కరించాలని రెండు రాష్ర్టాలు విజ్ఞప్తిచేశాయి. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 89 ప్రకారం కాకుండా అంతరాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం నదీజలాలు పంపిణీ చేయాలని, అందుకోసం కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రస్తుతమున్న బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కే ఆ మేరకు అధికారాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలివ్వాలని 2015లో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం విత్డ్రా పిటిషన్ను దాఖలు చేసింది. తాజాగా ఈ పిటిషన్పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ కొనసాగింది.
తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్లో అనేక వివాదాలున్నాయని, సుప్రీంకోర్టు ద్వారానే వాటికి పరిష్కారం లభించాల్సి ఉన్నదని ఏపీ పట్టుబట్టింది. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత జలాల పంపిణీ అంశం తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకే పరిమితమని.. నాలుగు రాష్ర్టాల మధ్య వివాదం కొత్తగా ఏమీలేదని కర్ణాటక ప్రభుత్వం వాదించింది. ఈ నేపథ్యంలో పిటిషన్ విచారణను ఫుల్బెంచ్కు బదిలీ చేయాలని, అక్కడే తమ వాదనలు వినిపించి పిటిషన్ ఉపసంహరణకు అనుమతి తీసుకుంటామని తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేశారు. దీంతో పిటిషన్ విచారణను ఫుల్బెంచ్కు బదిలీ చేస్తున్నట్టు దీంతో పిటిషన్ విచారణను ఫుల్బెంచ్కు బదిలీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు చాంబర్ జడ్జి జస్టిస్ అనిరుద్దబోస్ ప్రకటించారు.