హైదరాబాద్ : తెలంగాణ నుంచి తమకు రావాల్సిన బాకీలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ జెన్కో తెలంగాణ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ బకాయిలపై తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ విద్యుత్ సంస్థలే తెలంగాణకు బాకీ ఉన్నాయి. తెలంగాణకు ఏపీ రూ. 4,457 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. విద్యుత్ బకాయిలు ఇప్పించాలంటూ నిన్న హైకోర్టులో ఏపీ పిటిషన్ దాఖలు చేసింది.
ఏపీ చెల్లించాల్సిన బకాయిల గురించి మాత్రం మాట్లాడట్లేదు. ఉమ్మడి ఏపీలో తీసుకున్న రుణాలను తెలంగాణ చెల్లిస్తోంది. తెలంగాణ రూ. 2,725 కోట్లను చెల్లిస్తోంది. ఏపీ జెన్కో వాటాల విభజనలో తెలంగాణకు నిధులు రావాలి. కృష్ణపట్నం ప్లాంట్లో తెలంగాణ డిస్కంల పెట్టిన పెట్టుబడి సొమ్ము వడ్డీతో సహా రూ. 1,611 కోట్లు రావాలి. బకాయిలన్నీ కలిపి లెక్కిస్తే తెలంగాణకే ఏపీ బాకీ ఉంది. తెలంగాణ విద్యుత్ సంస్థలకే రూ. 4,457 కోట్లు చెల్లించాలి. తెలంగాణకు రావాల్సిన బకాయిలపై ఏపీ స్పందించట్లేదు. తెలంగాణ వాదనలను హైకోర్టుకు వివరిస్తాం అని సీఎండీ ప్రభాకర్ రావు తన ప్రకటనలో పేర్కొన్నారు.