హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): పాడి సంపదతోపాటు మాంసం ఉత్పత్తిలో కూడా దేశంలోనే తెలంగాణ టాప్లో ఉన్నదని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు అద్భుత ఫలితాలను అందించాయని అన్నారు. మంగళవారం హైదరాబాద్లో డాక్టర్ సీకే రావు ఎండోమెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 మంది ఉత్తమ వెటర్నరీ డాక్టర్లకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా గొల్ల కురుములను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, రాష్ట్రంలో మాంసం ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు లీటరు పాలపై రూ.4 ప్రోత్సాహం అందిస్తున్నట్టు తెలిపారు. 1962 సంచార పశు వైద్యశాలల ద్వారా రాష్ట్రంలోని నలుమూలల పశువులకు మేలైన వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు.