హైదరాబాద్, సెప్టెంబర్ 18 ( నమస్తే తెలంగాణ ): తెలంగాణ కీర్తి పతాక మరోసారి జాతీయ స్థాయిలో ఎగిసింది. రూర్బన్ పథకం అమలులో తొలి రెండు స్థానాలు మన రాష్ర్టానికే దక్కాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ శనివారం ప్రకటించిన రూర్బన్ ర్యాంక్లలో సంగారెడ్డి జిల్లాలోని ర్యాకల్ క్లస్టర్ మొదటి స్థానం సాధించగా, కామారెడ్డి జిల్లా జుక్కల్ క్లస్టర్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 14 అంశాలను ప్రామాణికంగా తీసుకొని కేంద్రం ర్యాంక్లు ప్రకటించింది. ర్యాకల్ క్లస్టర్కు 91.93, జుక్కల్కు 91.52 స్కోర్ లభించింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పల్లెప్రగతి, మిషన్భగీరథ పథకాల ద్వారా చేపట్టిన కార్యక్రమాలు ఈ రెండు క్లస్టర్లను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. పట్టణాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా 300 క్లస్టర్లలో రూర్బన్ పథకాన్ని అమలుచేస్తున్నారు. తెలంగాణలో 17 క్లస్టర్ల(మండలాలు)లో అమలవుతున్నది. ఈ పథకం అమలు కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ క్రిటికల్ గ్యాప్ ఫండ్ (సీజీఎఫ్) పేరిట రూ.435 కోట్లు వెచ్చిస్తుంది. ఆయా క్లస్టర్లలో ఈ పథకం అమలుకయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాల్సి ఉంటుంది.. రాష్ట్రంలోని 17 క్లస్టర్లకు కేంద్రం సీజీఎఫ్ కింద కేటాయించిన రూ.435 కోట్లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,450 కోట్లు జోడించి, మొత్తం రూ.1,885 కోట్లతో పనులు చేపట్టింది.
జుక్కల్లో తీరిన కంది రైతుల కష్టాలు
కామారెడ్డి జిల్లా జుక్కల్లో రూర్బన్ పథకం కింద రూ.187 కోట్లతో పనులు చేపట్టారు. సీజీఎఫ్ కింద రూ.30 కోట్లు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం రూ.157 కోట్లు విడుదలచేసింది. దీంతో మండలంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి. జుక్కల్ మండలంలో రైతులు పండించిన కందులను రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించింది. వాటిని భద్రపరిచేందుకు గోదాములు నిర్మించింది. దీంతో కంది రైతులకు దళారీల నుంచి కష్టాలు, నష్టాలు తప్పాయి. క్లస్టర్లోని పాడి రైతుల కోసం బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్, యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రం, 30 పడకల దవాఖాన, పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, పంచాయతీ భవనాలు నిర్మించారు.
ర్యాకల్లో మిల్క్ చిల్లింగ్ సెంటర్
రూర్బన్ పథకం కింద ర్యాకల్ మండలంలో రూ.137కోట్లతో పనులు చేశారు. ఇందులో సీజీఎఫ్ కింద రూ.30 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.107 కోట్లు ఖర్చు పెట్టింది. పాడి రైతుల మిల్క్ చిల్లింగ్ సెంటర్ను రూ.4.69 కోట్లతో నెలకొల్పారు. దీనిద్వారా ర్యాకల్తోపాటు చుట్టుపక్కల ఏడు మండలాల్లోని మూడువేల మంది పాడి రైతులు లబ్ధిపొందుతున్నారు. శిథిలావస్థలో ఉన్న మిల్క్ చిల్లింగ్ సెంటర్కు కొత్త భవనాన్ని నిర్మించారు. వాహనాలను సమకూర్చి, పాల సేకరణ సామర్థ్యాన్ని పెంపొందించారు.