న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధమైంది. దీనికోసం వచ్చే వర్షాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అండ్ బ్యాంకింగ్ లా చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయనుంది. సీఎన్బీసీ ఆవాజ్ మీడియా సంస్థ వెల్లడించిన దాని ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లను ప్రైవేటీకరించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని గత యూనియన్ బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కొత్త ప్రభుత్వ రంగ సంస్థల విధానం ప్రకారం ప్రైవేటీకరణ, విలీనం చేయాల్సిన సంస్థల వివరాలను నీతి ఆయోగ్ సిఫార్సు చేయనుంది. ఈసారి ఈ రెండు బ్యాంకులను ప్రైవేటీకరించాల్సిందిగా నిర్ణయించినట్లు సమాచారం. కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ప్రభుత్వ శాఖ కార్యదర్శుల గ్రూపు వీటికి ఆమోదం తెలిపిన తర్వాత ఆల్టర్నేటివ్ మెకానిజం ముందుకు నివేదిక వెళ్తుంది. చివరికి కేబినెట్ ఆమోదం కోసం పంపుతారు.