హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. జీతాలు, ఇతర సౌకర్యాల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే రాష్ట్ర ఉద్యోగులే మెరుగైనస్థితిలో ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, రోజూవారీ వేతన ఉద్యోగులకు కూడా పీఆర్సీ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. ఉద్యోగుల వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం జీఎస్డీపీలో 4.8 శాతం ఖర్చు చేస్తున్నది.
పీఆర్సీ నివేదిక ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పెన్షన్ల కోసం రూ.35,282 కోట్లు ఖర్చు చేసింది. పీఆర్సీ కంటే ముందు అధిక వేతనాలు ఇస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగోస్థానంలో ఉండగా, ఇప్పుడు రెండో స్థానంలోకి వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి రూ.81,432 కోట్ల ఆదాయం వస్తే వేతనాల కోసం రూ.30,930 కోట్లు ఖర్చు చేసింది. ఇది మొత్తం ఆదాయంలో 38 శాతం. ఆంధ్రప్రదేశ్లో ఇదే కాలానికి రూ.1,16,178 కోట్ల ఆదాయం రాగా, ఉద్యోగుల వేతనాల కోసం రూ.43,997 కోట్లు ఖర్చు చేసింది. ఇది 37.9 శాతమే.
దేశంలో ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఆ తర్వాతి స్థానం తెలంగాణదే. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కనీసవేతనం చాలా తక్కువగా ఉన్నది. తెలంగాణలో కనీస వేతనం రూ.19,000 ఉండగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 మాత్రమే. కేరళలో మాత్రమే రూ.23,000 ఉన్నది. ఢిల్లీలో కనీస వేతనం రూ.16,681.
సీపీఎస్ సభ్యులకు ఆపన్న హస్తం కేంద్రం కాంట్రిబ్యూటరీ పెన్షన్స్కీమ్ (సీపీఎస్) పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం లేకుండా చేసింది. దీంతో అనేక మంది సీపీఎస్ ఉద్యోగులు పెన్షన్స్కీమ్ కోసం ఆందోళనలు చేస్తున్నారు.
సీపీఎస్ ఉద్యోగులు సర్వీసులో ఉండగా చనిపోతే వారి కుటుంబాలకు పెన్షన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ పరిస్థితిని పరిశీలించిన సీఎం కేసీఆర్ సీపీఎస్ ఉద్యోగి మరణిస్తే ఫ్యామిలీ పెన్షన్ అమలుచేయాలని నిర్ణయించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థను సృష్టించి వారిచేత వెట్టిచాకిరీ చేయించిన ఉమ్మడి ఏపీ పాలకులు ఏనాడూ వారి వేతనాల పెంపు గురించి ఆలోచించలేదు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, అంగన్వాడీ, డైలీ వేజ్ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెరిగాయి. దేశంలోనే మొదటిసారి పీఆర్సీ ద్వారా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచింది తెలంగాణలోనే.