కరోనాను కట్టడి చేయడానికి సమర్థ చర్యలు తీసుకుంటూనే, వైద్య వ్యవస్థను శాశ్వత ప్రాతిపదికన పటిష్ఠం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరిస్తున్నది. దీనిలో భాగంగానే వరంగల్లో మల్టీలెవల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను 24 అంతస్తులతో నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దేశంలోనే అత్యద్భుతమైన రీతిలో ఆధునిక సాంకేతికతతో, సకల సదుపాయాలతో గ్రీన్ బిల్డింగ్గా దీనిని తీర్చిదిద్దనున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యసేవల కోసం దవాఖానపై హెలికాప్టర్ దిగేందుకు హెలిపాడ్ను కూడా రూపొందిస్తుండటం విశేషం. ఇతర దేశాలు పర్యటించి, అక్కడి హంగులను పరిశీలించి, వరంగల్ ఆస్పత్రిని అత్యాధునికంగా నిర్మించాలని వైద్యనిపుణులకు ముఖ్యమంత్రి సూచించారు. జైలు స్థలంలో దవాఖానను నిర్మించాలని నిర్ణయించిన వెంటనే అతివేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 21ననే శంకుస్థాపనకు రంగం సిద్ధమైంది.
ఆరోగ్య రంగానికి కేంద్రప్రభుత్వం జీడీపీలో 4.5 శాతానికి మించి ఖర్చుచేయటం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల మాదిరిగానే వైద్యం కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. 1957 నుంచి రాష్ట్రంలో ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటలైనా ఏర్పాటు చేయలేదు. నాడు నలభై లక్షలున్న హైదరాబాద్ జనాభా నేడు కోటిన్నరకు చేరింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా వైద్య వసతులు పెంచలేదు. ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో ఎదురవుతున్న సమస్యలు అన్ని ఇన్నీ కావు. 2014 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల ప్రతి వ్యక్తి తన ఆదాయంలో ఎక్కువ భాగం వైద్యం కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కార్పొరేట్ హాస్పిటళ్లు అనేకం చికిత్స కోసం వచ్చిన వారిని ఆర్థికంగా పీల్చిపిప్పిచేస్తున్నాయి. వైద్య ఖర్చుల మూలంగా ఎక్కువమంది పేదరికంలోకి జారిపోతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి.
విద్యను, వైద్యను ప్రాధాన్య రంగాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారు. ఇప్పటికే కేసీఆర్ కిట్ మూలంగా సర్కార్ దవాఖానలలో ప్రసవాలు 29నుంచి 55శాతానికి పెరగటం గమనార్హం. కరోనా రోగుల చికిత్స కోసం ప్రత్యేకించి ‘టిమ్స్’ దవాఖానను ఏర్పాటు చేశారు. ఇంటింటి జ్వర సర్వే, ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ లాంటి వినూత్న కార్యాచరణను ప్రభుత్వం చేపట్టింది. ప్రజలకు అన్నిరకాల నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో ఉండే విధంగా సూపర్ స్పేషాలిటీ దవాఖానలను అందుబాటులోకి తెస్తున్నది. జిల్లా కేంద్రాల్లో వైద్య పరీక్షా కేంద్రాల ఏర్పాటుతో పాటు, క్యాన్సర్ చికిత్సా కేంద్రం వంటి వైద్య సదుపాయాలను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నది. సమాజ ఉన్నతిని ప్రజల ఆరోగ్యం, ఆయుఃప్రమాణంతో కొలుస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేస్తుండటం హర్షణీయం.