హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరులో రైల్వే కీలకపాత్ర పోషిస్తున్నది. ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి ప్రాణవాయువును తరలించేందుకు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ సేవలు అందిస్తున్నది. కరోనా బాధితుల కోసం ఇప్పటివరకు దేశంలోని అన్ని రైల్వేజోన్ల పరిధిలో 4 వేలకుపైగా కొవిడ్ కేర్ కోచ్లను ఏర్పాటుచేసింది. వాటిలో దాదాపు 64 వేల పడకలను సిద్ధంచేసింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలోనే దాదాపు 450కి పైగా బోగీలను అందుబాటులో ఉంచింది. మొత్తంగా దాదాపు 150 పైగా కొవిడ్ కేర్ కోచ్లను మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్ తదితర ఐదు రాష్ర్టాలు ఉపయోగించుకున్నాయి. తెలంగాణలో సైతం రైల్వే బోగీల ద్వారా కరోనా రోగులకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. 100 బోగీలను సిద్ధంచేసి ఉంచాలని దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులను రాష్ట్ర వైద్యాధికారులు కోరినట్టు తెలిసింది. ఇప్పటికే సికింద్రాబాద్, కాజీపేట వంటి కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో కొవిడ్ కేర్ కోచ్లను అందుబాటులోకి తెచ్చామని రైల్వే అధికారులు ప్రకటించారు.
కరోనా బాధితులకు అవసరమైన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎండీ)ని ఉత్పత్తి ప్లాంటు నుంచి ఇతర ప్రాంతాలకు చేరవేయడంలో రైల్వేలు ముఖ్యభూమికి పోషిస్తున్నాయి. పలు మార్గాల్లో ఇప్పటికే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లను రైల్వే అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో సికింద్రాబాద్ నుంచి తొలి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ను బుధవారం దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. మొత్తం ఐదు ఆక్సిజన్ ట్యాంకర్లతో ఉన్న ఈ ఎక్స్ప్రెస్ ఒడిశాలోని అంగూల్కు బయలుదేరింది. ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్ను నింపుకొని సికింద్రాబాద్కు తిరిగి వస్తుంది. ఇది తెలంగాణ నుంచి బయలుదేరిన మొదటి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లను వేగంగా నడుపడానికి ఆయా మార్గాల్లో గ్రీన్ కారిడార్ను ఏర్పాటుచేసింది. రైళ్ల రాకపోకలకు ఆటంకాలు లేకుండా ఆయా డివిజన్ల మేనేజర్లు నిత్యం పర్యవేక్షించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఆదేశించారు.