హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరోసారి పేదల పట్ల తన పెద్ద మనుసు చాటుకున్నారు. పలు కారణాలతో పెండింగ్లో ఉన్న కొత్త రేషన్కార్డుల పంపిణీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్తగా దాదాపు నాలుగున్నర లక్షలమందికి రేషన్ కార్డులు అందనున్నాయి. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు రేషన్కార్డులు మంజూరు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం 4,46,168 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ దరఖాస్తులన్నింటికీ 15 రోజుల్లోగా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను పూర్తిచేయాలని మంత్రివర్గం సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో నాలుగున్నర లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. ఇప్పటికే రాష్ట్రంలో 87.43 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటి వల్ల సుమారు 2.83 కోట్ల మంది లబ్ధిదారులకు ఆకలి తీరుతున్నది.
కొత్త కార్డులు ఇవ్వాలన్న నిర్ణయంతో రాష్ట్రంలో తెల్ల రేషన్కార్డుల సంఖ్య సుమారు 92 లక్షలకు పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంబంధం లేకుండా సొంతంగా సుమారు 34 లక్షల కార్డులకు ఉచితంగా రేషన్ సరుకులను సరఫరా చేస్తున్నది. లాక్డౌన్ సమయంలో పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్కార్డుదారులకు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నాయి. అయితే కొత్త రేషన్కార్డులు లేకపోవడంతో కొంతమందికి ఉచిత బియ్యం లభించలేదు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వీరు కూడా ఉచిత రేషన్ బియ్యం అందుకోనున్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో నూతన రేషన్కార్డుల జారీకి పౌరసరపరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లాలవారీగా దరఖాస్తుదారుల వివరాలను సేకరించారు. కార్డుల జారీపై బుధవారం పౌరసరఫరాల సంస్థ అధికారులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశమున్నది. కార్డుల జారీకి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి.. కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో రేషన్ డీలర్ల కమీషన్తో సహా ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి మార్గాల సూచనకు క్యాబినెట్ సబ్కమిటీని ఏర్పాటుచేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నది. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్ కమిటీలో మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి సభ్యులుగా ఉన్నారు.