హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): చేపల ఉత్పత్తికి తెలంగాణలో పుష్కలమైన అవకాశాలున్నాయని, త్వరలోనే రాష్ట్రం చేపలను ఎగుమతిచేసే స్థాయికి చేరుకుంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్లో తనతో సమావేశమైన ఫిషరీష్ సైన్స్ విద్యార్థులతో ఆయన పలు విషయాలపై చర్చించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన సాగునీటి కష్టాలు స్వరాష్ట్రంలో తీరాయని వినోద్కుమార్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా చేపల ఉత్పత్తికి అవకాశాలు భారీగా పెరిగాయని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపల పిల్లల పంపిణీ పథకం సత్ఫలితాలను ఇచ్చిందని గుర్తుచేశారు.
ప్రస్తుతం ఆయా నీటి వనరుల్లో 90 కోట్ల చేపపిల్లలను వదులుతుండగా.. భవిష్యత్లో దీన్ని రెండుమూడు రెట్లు పెంచనున్నట్టు చెప్పారు. ఇకపై స్థానికంగానే ఫిష్సీడ్స్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేపల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఫిషరీష్ పట్టభద్రులు, డిప్లొమా విద్యార్థుల సేవలను ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో విద్యార్థి సంఘం అధ్యక్షుడు ప్రభాకర్, రమేశ్, మురళి, శ్రావ్య, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.